24 September 2016
Hyderabad
ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ఎన్ ఇన్స్పైర్డ్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్, ఫ్రైడే ఫిలింవర్క్స్ బ్యానర్స్పై సుశాంత్ సింగ్ రాజపుత్, కైరా అద్వాని, దిశాపటాని, అనుపమ్ ఖేర్, భూమిక చావ్లా ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం 'ఎం.ఎస్.ధోని' ..ది అన్టోల్డ్ స్టోరీ ట్యాగ్లైన్. నీరజ్ పాండే దర్శకత్వంలో అరుణ్ పాండే, ఫాక్స్స్టార్ స్టూడియోస్ నిర్మాతలుగా సినిమా తెరకెక్కింది. ఈ సినిమా సెప్టెంబర్ 30న విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమంలో భారతజట్టు క్రికెట్ కెప్టెన్ ఎం.ఎస్.ధోని, ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి, చిత్ర నిర్మాత అరుణ్ పాండే తదితరులు పాల్గొన్నారు. బిగ్ సీడీని ఎం.ఎస్.ధోని, ఎస్.ఎస్.రాజమౌళి విడుదల చేశారు. ఈ సందర్భంగా...
ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ - ''నాలాంటి ఎన్నో లక్షల మందికి ధోని ఇన్స్పిరేషన్. అందులో నేను కూడా ఒకడిని. ఈ ఆడియో వేడుకలో పాల్గొనడమే చాలా గౌరవంగా భావిస్తున్నాను. గవాస్కర్, అజారుద్దీన్ వంటి గొప్ప ఆటగాళ్ళు ఉండటం వల్ల క్రికెట్ను అందరూ చాలా ఇష్టంగా చూడటం మొదలు పెట్టాం. అయితే ఇండియా గెలుస్తుందా లేదా అనే భయం ఉండేది. నెగ్గే సందర్భంలో కూడా ఓడిపోయిన మ్యాచ్లున్నాయి. మనం ఆనందంగా కంటే భయంతోనే ఎక్కువ మ్యాచ్లు చూసేవాళ్ళం. అయితే ధోని వచ్చినప్పుడు, కెప్టెన్ అయినప్పుడు భయం లేకుండా క్రికెట్ చూస్తున్నాం. మెక్గ్రాత్ వస్తున్నాడా..వసీం ఆక్రమ్ వస్తాడా అనుకుని భయపడేవాళ్ళం. కానీ ధోని కెప్టెన్ అయిన తర్వాత ఎవర్నీ చూసి భయపడలేదు. డెబ్యూట్ క్రికెటర్స్ కూడా ఎటువంటి భయం లేకుండా ఆడేలా ధోని చేశాడు. అదే ఇండియన్ క్రికెట్కు ధోని చేసిన మేలు. ఎటువంటి భయాలు లేకుండా..ఫ్రీగా క్రికెట్ను మేమంతా చూసేలాచేసిన దోనికి థాంక్స్. చేసే పనులు పట్ల మాత్రమే దృష్టి పెట్టు..ఫలితంపై కాదు అని భగవద్గీతలో ఓ శ్లోకం ఉంటుంది. 1983లో వరల్డ్కప్ నెగ్గిన తర్వాత 2011లో ఇండియా మరోసారి వరల్డ్కప్ నెగ్గింది. కప్ తీసుకున్న 130 కోట్ల భారతీయులు కప్ కోసం వెయిట్ చేస్తుంటే...ధోని దాన్ని తన చేతిలో కాకుండా తన సహచరుల చేతికి అందించి పక్కన నిలబడ్డాడు. తనొక కర్మయోగి. తనెలా ఎలా అయ్యాడని చెప్పడానికి చేసిన సినిమాయే ధోని. ఒక సాధారణ వ్యక్తి..ధోని ఎలా అయ్యాడో ధోని సినిమా రూపంలో చూపించిన నీరజ్ పాండేగారికి థాంక్స్. ఈ సినిమాను నేను మొదటి షోనే చూస్తాను. సుశాంత్సింగ్ రాజ్పుత్...ట్రైలర్ చూసి అచ్చు ధోనిలా చేశాడే అని అందరూ అనుకున్నారు. అయితే ఒక డైరెక్టర్గా ఒక వ్యక్తి మరో వ్యక్తిలా నటించాలంటే అలాగే జీవించాలి. సుశాంత్ సింగ్ రాజ్పుత్ అలాగే చేశాడు. తనకు నా అభినందనలు. సాధారణ టికెట్ కలెక్టర్ కోట్ల మంది భారతీయులకు ఆరాధ్య క్రికెటర్గా ఎలా అయ్యాడో తెలియజెప్పిన నీరజ్పాండేగారికి థాంక్స్'' అన్నారు.
ఎం.ఎస్.ధోని మాట్లాడుతూ - ''రాజమౌళిగారు ఇక్కడకు రావడం ఎంతో ఆనందంగా ఉంది. నాతో పాటు హైదరాబాద్ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది హైదరాబాద్ బిర్యానీ. నేను ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడే సమయంలో ఓ క్రికెట్ మ్యాచ్ కోసం 2000వ సంవత్సరంలో హైదరాబాద్ వచ్చాం. అప్పుడే నేను హైదరాబాద్ బిర్యాని టేస్ట్ చేశాను. అప్పటి నుండి ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా బిర్యానీని టేస్ట్ చేయకుండా విడిచిపెట్టను. అలాగే హైదరాబాద్ బేకరి బిస్కట్స్, మట్టిగాజులు అంటే ఇష్టం. అలాగే మాకు ఇక్కడ అభిమానులు అందించే సపోర్ట్ మరచిపోలేను. ఎవరైనా ప్రాక్టికల్, నిజాయితీ ఉండాలి. లైఫ్లో రిస్క్ తీసుకోవాలి. కాలిక్యులేషన్స్ కూడా ఉండాలి. కష్టపడాలి. పెద్దలను గౌరవించాలి. జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు చిరునవ్వుతో ఎదుర్కొవాలి. అపరిచితుడు సినిమా చూశాను. రీసెంట్గా బాహుబలి సినిమా చూశాను. నాకు బాగా నచ్చింది. సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నాను. దక్షిణాదిన చాలా మంది మంచి నటీనటులు, టెక్నిషియన్స్ ఉన్నారు. చాలా మంచి సినిమాలను తీస్తున్నారు. బాలీవుడ్లో కూడా ఆ సినిమాలు రీమేక్ అవుతున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్పుత్ నాలాగే కనపడ్డాడు. అందుకోసం అతను చాలా కష్టపడ్డాడు. తనకు అభినందనలు'' అన్నారు.