నందమూరి బాలకృష్ణ 56వ పుట్టినరోజు వేడుకలు శుక్రవారం హైదరాబాద్ బసవతారకం హాస్పిటల్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ తనయ బ్రాహ్మణి, చిత్ర దర్శకుడు క్రిష్ సహా యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. కేక్ కటింగ్ చేసిన అనంతరం బ్రాహ్మణి క్యాన్సర్ బాధిత పిల్లలకు కేక్ తినిపించి, పండ్లను పంపిణీ చేశారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో...
బ్రాహ్మణి మాట్లాడుతూ``సాధారణంగా ఎవరికైనా వయసు అయిపోతుంటే ఎనర్జీ తగ్గిపోతుంది. కానీ నాన్నగారిలో ఎనర్జీ పెరుగుతుంది. నాన్నగారు 56 సంవత్సరాలను పూర్తి చేసుకుని 57వ ఏట అడుగుపెడుతుండటం ఆనందంగా ఉంది. ఆయన మనవడితో చిన్నపిల్లాడిలా ఆడుకుంటుంటారు. తాతగారు స్వీర్గీయ నందమూరి తారక రామారావుగారు నుండి మానవసేవే మాధవసేవ అనే సూత్రాన్ని పాటిస్తూ ఆయన ఛైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న బసవతారకం హాస్పిటల్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. ఆయన కృషి ఫలితంగానే ఇప్పుడు ఈ హాస్పిటల్ ఇండియాలో బెస్ట్ హాస్పిటల్ గా పేరు సంపాదించుకుంది. ఈ హాస్పిటల్కు ఫండ్స్ రైజింగ్ కోసం ఇప్పుడు కూడా ఆయన ఆమెరికాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు`` అన్నారు.
చిత్ర దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ``బాలకృష్ణగారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. ఆయన 56 ఏళ్లను పూర్తి చేసుకున్నారా అనే ప్రశ్న మనసులో ఉంది. ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఎనర్జిటిక్గా ఉంటారు. గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాన్ని మొరాకాలో చిత్రీకరిస్తున్నప్పుడు మాకొక మార్గదర్శిగానే కాకుండా దర్శకుడికి విలువినిస్తూ నిత్యవిద్యార్థిలా వ్యవహరించారు. ప్రతి టెక్నిషియన్కు ఎంత మర్యాద ఇవ్వాలో తెలిసిన వ్యక్తి. ఆయన హీరోగా కంటే వ్యక్తిగతంగా నాకు అనుబంధం ఏర్పడింది. గొప్ప వాల్యూస్ ఉన్న వ్యక్తి. బసవతారకం హాస్పిటల్లో ఫండ్స్ రైజింగ్ కార్యక్రమం కోసం ఇప్పుడ అమెరికాలో బిజీగా ఉన్నారు. ఇదే హాస్పిటల్లో మా అమ్మగారికి కూడా వైద్యం చేయించాం. ఇండియాలోనే బెస్ట్ హాస్పిటల్స్ లో ఇదొకటి`` అన్నారు.
బసవతారకం హాస్పిటల్ సి.ఇ.ఓ ఆర్.పి.సింగ్ మాట్లాడుతూ``ఇండియాలోనే బెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ గా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ను నిలపడంలో బాలకృష్ణగారి కృషి ఎంతో ఉంది. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు`` అన్నారు.