12 November 2018
Hyderabad
నల్లస్వామి సమర్పణలో యు అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తనీశ్, పరుచూరి రవి, ప్రియా సింగ్, పరుచూరి వెంకటేశ్వరరావు, షఫీ, పోసాని కృష్ణమురళి ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న చిత్రం `రంగు`. కార్తికేయ దర్శకుడు. ఎ.పద్మనాభ రెడ్డి, నల్ల అయన్న నాయుడు నిర్మాతలు. విజయవాడకు చెందిన లారా అనే వ్యక్తి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం ఈ నెల 23న విడుదలవుతుంది. అయితే లారా కుటుంబ సభ్యుడైన దిలీప్, స్నేహితుడు సందీప్ ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...
దిలీప్ మాట్లాడుతూ - ``ఇటీవల జరిగిన రంగు ప్రెస్మీట్లో విజయవాడ రౌడీ షీటర్ లారా కథ ఇది అని యూనిట్ సభ్యులు చెప్పారు. నేను ఆయన బామమరిదిని. ఆయన అసలు పేరు గుంటూరు పవన్కుమార్. లారా మీద 2000 సంవత్సరంలో విజయవాడలో రౌడీ షీట్ తెరిచిన మాట వాస్తవమే. కానీ ఆ రౌడీ షీట్ ఎందుకు తెరిచారనేది యూనిట్ సభ్యులకు తెలియదు. వ్యక్తిత్వం పరంగా లారా చాలా మంచివాడు. ఆయనపై సినిమా తీస్తూ ఆయన కుటుంబ సభ్యులను కానీ.. స్నేహితుల్ని కానీ ఎవరినీ సంప్రదించలేదు. సంప్రదించకుండా సినిమా ఎలా తీస్తారు. ఏడాది క్రితం దర్శకుడు మరికొంత మంది లారా కోసం కొంత మంది వ్యక్తులను కలిసినట్లు తెలిసింది. అప్పుడు విషయం తెలియక మేం ఊరుకున్నాం. కానీ ఇప్పుడు సినిమా తీశారు.మేం దర్శకుడ్ని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తే కుదరలేదు. మాకు చూపించకుండా సినిమాను విడుదల చేస్తే మా నుండి వ్యతిరేకత వస్తుంది. అభ్యంతరకర సన్నివేశాలుంటే వాటిని తొలగించాలి. రెండు రోజుల్లో దర్శక నిర్మాతలు స్పందించకుంటే కోర్టులో కేసు వేస్తాం`` అన్నారు.
కృష్ణాజిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడు సందీప్ మాట్లాడుతూ - ``నేను లారా స్నేహితుడ్ని. వారు మాకు అందుబాటులోకి రాలేదు. విజయవాడ అంటే కేవలం రౌడీలే ఉంటారనుకుంటే ఎలా.. చాలా మంచి చేసిన వ్యక్తులున్నారు. లారాగారి విషయానికి వస్తే..ఆయనెన్నో మంచి పనులు చేశారు. ఓ స్నేహితుడిగా ఆయనకు మద్దతిస్తున్నాను. ఎలాంటి రాజకీయాలు లేవు`` అన్నారు.