ఎన్టీఆర్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో నటించిన సినిమా `అరవింద సమేత వీరరాఘవ`. ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకుడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. చినబాబు నిర్మాత. ఈ సినిమా అభినందన సభ ఆదివారం హైదరాబాద్లో జరిగింది..
సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ ``అవాక్కయ్యేలా ఉంది సినిమా. ఈ సినిమా నవరాత్రుల పర్వదినం సందర్భంగా విడుదలైంది ఈ సినిమా. మనిషిలోని మహిషాసురుని అంతం చేయడం అనే ధోరణితో చూడగలిగితే, త్రివిక్రమ్ చేసిన మహత్తరమైన ప్రక్రియ అని తెలుస్తుంది. ఇందులో ప్రతి ఫ్రేము కూడా చివరిదాకా చాలా బావుంటుంది. అనేక కోణాల్లో ఈ సినిమాను చూడాలి. స్త్రీ దృష్టి నుంచి ఇప్పటివరకు కూడా జరుగుతున్న హింసను గురించి చెప్పలేదు. అక్కడ చావడానికే పుడతారని అనుకుంటున్న రోజుల్లో .. . వాళ్ల ఇంట్లో ఆడవాళ్లు ఏమనుకుంటున్నారని చర్చకు తెరతీసిన సినిమా ఇది`` అని అన్నారు.
బ్రహ్మాజీ మాట్లాడుతూ ``నన్ను సొంత అన్నలా చూసుకున్నాడు తారక్. ఒక రోజు నాతో తను రూమ్ షేర్ చేసుకోమన్నాడు. నన్ను అంతలా ప్రేమిస్తాడు`` అని అన్నారు.
ఈశ్వరీరావు మాట్లాడుతూ ``ఈ కథను ఈ టీమ్ ఎంపిక చేసుకోవడం, దాన్ని ఎన్టీఆర్గారు ఓకే చెప్పి, ఇంత మంది స్త్రీలకు ఇంత విలువ ఉందని చెప్పడం నిజంగా పెద్ద విషయం. ఆర్టిస్టు కాస్త ఎక్కువ చేస్తున్నారని అనగానే హీరోలే తక్కువ చేస్తారు అని ఈ మధ్య జగపతిబాబుగారు చెప్పారు. అలాంటిది ఇంత గొప్ప పాత్రలను మాతో చేయించడం చాలా ఆనందంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా చాలా ఫోన్లు వస్తున్నాయి`` అని చెప్పారు.
ఈషా రెబ్బా మాట్లాడుతూ ``ఈ సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు అభిమానులకు చాలా థాంక్స్. ఇంత మంచి సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు. ఇంత మంచి సినిమాలో నేను కూడా భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. త్రివిక్రమ్గారితో మరలా పనిచేయాలని ఉంది. తారక్గారితో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన హార్డ్ వర్క్, డెడికేషన్ అమేజింగ్. పూజా చాలా స్వీట్ హార్ట్`` అని అన్నారు.
పూజా హెగ్డే మాట్లాడుతూ ``మహిళలకు ఇంత స్ట్రాంగ్ పాత్రలు ఉండటం, వాటిని ఆడియన్స్ మెచ్చుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇదంతా త్రివిక్రమ్గారి వల్లనే. ఈ సినిమాలో మహిళలకు ఇచ్చిన గౌరవం చూస్తే చాలా ఆనందంగా అనిపించింది. నా పెర్ఫార్మెన్స్ ను, నా డబ్బింగ్ను మెచ్చుకున్నందుకు చాలా హ్యాపీ. నేను అంకితభావంతో పనిచేస్తానని అనుకున్నా. కానీ తారక్ని చూసిన తర్వాత అది తప్పని తెలిసింది. తన ఇంట్లో అంత ఇబ్బందులు ఉన్నా ఆయన సరిగా చేశారు. జె.బి.సార్ ఈ సినిమాలో రాక్ స్టార్. ఈ పరిశ్రమకు ఆయనే రాక్ స్టార్. ఈ యూనిట్ సభ్యులందరికీ ధన్యవాదాలు`` అని అన్నారు.
జగపతిబాబు మాట్లాడుతూ ``బసిరెడ్డి అనే పాత్ర గ్రామాల్లోకి వెళ్లిందంటే దానికి కారణం త్రివిక్రమ్, ఎన్టీఆర్. సినిమా ఇరగొట్టేస్తోంది. ప్రేక్షకులే హిట్ అని చెప్పారు. టెక్నీషియన్లకు, నటీనటులకు థాంక్స్. చార్టర్డ్ ఫ్లైట్లో వచ్చి పూజా షూటింగ్ చేసి వెళ్తోంది. నా కెరీర్ 2010లో హీరోగా అయిపోయింది. 2012లో మా బాలయ్యబాబుతో లెజెండ్ చేశాక.. అందులో జితేంద్ర పాత్రతో మొదలైంది. తారక్లోనూ, బాలయ్యబాబులోనూ నాకు ఒకే లక్షణం కనిపించింది. ప్రతి నాయకుడు, నాయకుడు అనే మాటను బాలయ్య అనేవారు. అలాంటి విషయాన్నే తారక్ చేశారు. తారక్తో కూడా ఒక సిట్చువేషన్లో కూర్చుంటే ఓ మంచి విషయం జరిగింది. అవన్నీ నేను బయటకు చెప్పుకోలేను. నాన్నకు ప్రేమతో చేసేటప్పుడు తారక్కీ, నాకూ చిన్న డిస్కషన్ వచ్చింది. `తారక్.. నాకు నిన్నూ.. బాలయ్య బాబునూ ఒక స్టేజ్ మీద చూడాలని ఉంది` అని అన్నా. వెంటనే తారక్ రియాక్షన్ ఏంటంటే.. `బాబూ.. ఆయన బాబాయ్ బాబూ. నాకు ఇష్టం బాబూ` అని అన్నాడు. వాళ్లిద్దరితో నేను ఫొటో దిగాలని దిగా. సినిమాలు వస్తాయి.. పోతాయి.. కానీ.. నందమూరి ఫ్యామిలీ చాలా గొప్ప ఫ్యామిలీ. వాళ్ల అభిమానులు అందరూ గొప్పవారు. వాళ్లందరూ కలిసి చక్కగా ఉండాలనుకున్నా. ఇవాళ అది నెరవేరినందుకు ఆనందంగా ఉంది. వాళ్లిద్దరు కలిస్తే అసలైన దసరా, దీపావళి ఇప్పుడు చూస్తున్నాం`` అని అన్నారు.
త్రివిక్రమ్ మాట్లాడుతూ ``ఈ దసరాను ఇంత గొప్ప పండుగా మాకు అందించిన నందమూరి అభిమానులకు ధన్యవాదాలు. నాకు మాటలు కూడా రావడం లేదు. అంత ఆనందాన్ని అందరూ పంచారు. ఈ సినిమాకు పనిచేసిన నటీనటులకు, టెక్నీషియన్లకు ధన్యవాదాలు`` అని అన్నారు.
కల్యాణ్ రామ్ మాట్లాడుతూ ``అందరికీ నమస్కారం. సినిమా చూస్తుంటే రాయలసీమలో పుట్టి పెరిగిన వాళ్లు మాట్లాడుతున్నంత అథారిటీగా చేశాడు. అది చాలా బాగా నచ్చింది నాకు. త్రివిక్రమ్గారి సినిమాలు ఎంటర్టైనింగ్ వేలో వెళ్తుంటాయి. కానీ ఈ సినిమా చూశాక సినిమా ఎమోషనల్గా అనిపించింది. క్లైమాక్స్ చాలా బాగా అనిపించింది అని అన్నాను. జగపతిబాబుగారు మా ఫ్యామిలీ మెంబర్. ఆ పాత్రలో ఆయన్ని కాకుండా ఇంకెవరినీ ఊహించలేం. ఆ పాత్ర అంత గొప్పగా ఉండటం వల్లనే, తారక్ పాత్ర అంతగా ఎలివేట్ అయింది. సినిమా విడుదలయ్యే రెండు రోజుల ముందు తమ్ముడు మాట్లాడుతూ `సినిమాలో ప్రతి పాత్రలోనూ అందరూ జీవించేశారు. అంత అద్భుతంగా చేశారు` అని అన్నారు. అందుకే ప్రతి ఒక్కరికీ కంగ్రాట్స్ చెబుతున్నా. సినిమా చూశాక నేను కంగ్రాజులేషన్స్ చెప్పింది తమన్కి. తమన్ ఓ ఇళయరాజా రేంజ్లో కొట్టాడు. అతనికి కంగ్రాట్స్. యన్.టి.ఆర్. బయోపిక్ తో ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ అడగ్గానే వచ్చిన మా బాబాయ్కి చాలా థాంక్స్. మా నాన్నగారు ఈ ఫంక్షన్లో ఉంటే బావుండేది. మా బాబాయ్ మా నాన్నగారు లేరన్న లోటును తీర్చేశారు. జాగ్రత్తగా ఇంటికెళ్లండి. మీకోసం మీ ఇంట్లో మీ కుటుంబసభ్యులు వెయిట్ చేస్తుంటారు`` అని అన్నారు.
ఎన్టీఆర్ మాట్లాడుతూ ``మా సినిమా అనే ప్రయత్నాన్ని ఆశీర్వదించిన అభిమాన సోదరులకు వందనాలు. చేసిన ప్రయత్నాన్ని ఎంతో శ్రద్ధతో, ఎంతో నమ్మకంతో ఎంతో జాగ్రత్తతో ఆశీర్వదించారు. త్రివిక్రమ్గారు నా ఆప్తుడు, మిత్రుడు, శ్రేయోభిలాషి. త్రివిక్రమ్ మీద నమ్మకాన్ని ప్రేక్షకులు ఇలా చూపించారు. ఈ విజయదశమికి నల్లమబ్బు కమ్మిన విషాద చాయల్లో ఉన్న మా కుటుంబంలోకి కొత్త వెలుగు తెచ్చినందుకు థాంక్యూ. జీవితాంతం గుర్తుండిపోయే సినిమాను ఇచ్చారు. మా ఇద్దరి కలను వెనుక కూర్చుని వాళ్ల భుజాలపై తీసుకెళ్లిన ప్రతి సాంకేతిక నిపుణులు, ప్రతి నటుడు, ప్రతి నటికీ చేతులు జోడించి నా హృదయపూర్వక పాదాభివందనం. మా పల్లకీని మోసింది సాంకేతిక నిపుణులు. వాళ్ల కృషి వల్లనే ఈ సినిమా ఇంతబాగా వచ్చింది. ఈ ఆనందాన్ని కేవలం అభిమానులతోనే కాదు, మా బాబాయ్తోనూ పంచుకుందాం అని అనుకున్నాం. మా నాన్న ఇక్కడే ఎక్కడో తిష్ట వేసుకుని చూస్తూ ఉండి ఉంటారు. ఈ రోజు జరిగే ఈ ఘట్టాన్ని. తండ్రి హోదాలో మా నాన్నగారి హోదాలో ఇక్కడికి వచ్చిన బాబాయ్కి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతకన్నా మేం మాట్లాడితే బాగోదు. అందరూ ఎదురు చూసేది ఆయన మాటలకోసమే`` అని అన్నారు.
నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ``తెలుగుదేశం పార్టీకి తొలి దశలోనే ఎంతో శ్రమించిన మా అన్నయ్య హరికృష్ణగారు శివైక్యం కావడం నా మనసును ఎంతో ద్రవ్యపరిచింది. ముక్కుసూటి మనిషి ఆయన. ఆయన అనుకున్నది చేరుకోవడానికి ఎలాంటి లాభనష్టాలు బేరీజు వేయకుండా ధైర్యంగా ముందుకు సాగే ధైర్యశాలి. ఆయన మన మధ్య లేకపోవడం అంటే నాకు మనసు అంగీకరించడం లేదు. ఆయన మనసు వెన్నలాగా కరిగిపోయే తత్వం. ఆయన మొరటు మనిషి. తొలి దినాల్లో నాన్నగారు తెలుగు దేశం పార్టీ స్థాపించినప్పుడు ఆయన నాన్నగారికి చేదోడువాదోడుగా ఉంటూ తండ్రికి తగ్గ తనయుడిగా రాష్ట్రంలో ఓ వికాసాన్ని ప్రవహింపజేసి, చైతన్య రథసారథిగా పనిచేసిన ఆయనకు నివాళులు అర్పిస్తున్నాను. మా నాన్నగారి మరణానంతరం ఆయన ఉప ఎన్నికల్లో హిందూపూర్ లో 60 వేల మెజారిటీతో గెలిచారు. ఆయన రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ ను బంద్ చేశారు. అలాగే ముఖ్యంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లుగా ఉపాధి కల్పించారు. ఆయన తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. హిందూపూర్ వృద్ధికి ఎంతో సాయం చేశారు.
హారిక హాసిని క్రియేషన్స్ చినబాబు, పీడీ ప్రసాద్ నిర్మించిన అరవింద సమేత వీరరాఘవ సభకు వచ్చిన వారికి కళాభివందనాలు. ముందుగా నేను అభినందన చెప్పాల్సింది ఈ సినిమాను ఇంతగా ఆదరించి, ఘన విజయం చేసిన ప్రేక్షకులకు. ఈ అభినందన సభలో యూనిట్ని అభినందించాలి. అయితే వాళ్లు చేసిన ఈ సినిమాను ప్రేక్షకులు ఆశీర్వదించారు. దేవుడు తన కోరికను నెరవేరుస్తాడనే నమ్మకంతో భక్తుడిని వివిధ రకాల పేర్లతో స్తుతిస్తాడు. తన అభినందనలను తెలియజేసుకుంటాడు. దాన్నే అర్చించడం అని అంటాం. అయితే అది కూడా అభినందనలాంటిదే. మానవుడు సినిమాను వినోద సాధనంగా ఎంపిక చేసుకున్నాడు. మంచి సినిమాలను చూసి ఆదరించి,అభినందిస్తున్నారు. సినిమా ఎలా ఉండాలన్నది ఇండస్ట్రీలోనే పెద్దలు, నిర్మాతలు యన్.టి.ఆర్ బయోపిక్తో బిజీగా ఉండి, నేను దీన్ని చూడలేకపోయా. ఇందులో పాలిచ్చే తల్లులు పాలించలేరా అనే ఇతివృత్తం ఉందని తెలుసుకున్నా. నాకు లెజెండ్లో మహిళలకు సంబంధించి నేను చెప్పిన డైలాగ్ గుర్తుకొచ్చింది. త్రివిక్రమ్ సంభాషణల్లో ఒక పదునుతనం ఉంటుంది. ఈ సినిమాలో నటీనటుల నుంచి హావభావాలను రాబట్టుకోగలిగారు ఆయన. ఎన్నో చారిత్రాత్మక సినిమాలు మేం తెలుగులో తెరకెక్కించాం. స్త్రీలను గౌరవించే సంప్రదాయం మనది. అభిమానం వేరు.. ఆత్మాభిమానం వేరు. నేను జీవితాన్ని ఎంతో చూశా. మా నాన్నగారి పాత్రల ప్రభావంతో తెలుగుదేశం పార్టీని పెట్టారు. వెంటనే తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి అయ్యారు. స్పర్థయా వర్ధతే విద్య అని అంటాం. ఏ రంగంలోనైనా పోటీ ఆరోగ్యకరంగా ఉండాలి. ఇతరులను కించ పరచేలా ఉండకూడదు. పూర్వ జన్మలో కొంతమందితో ఉన్న పరిచయంతో, ఈ జన్మలో ఒకరిద్దరిని పొందవచ్చు. అభిమానం అనేది డబ్బుతో కొనలేనిదని అంటుంటాం. నా అభిమానులతో నాకున్న అనుబంధం గొప్పది. జగపతిబాబుగారు తన పాత్రలతో ఇమేజ్ను పదింతలు చేసుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నందుకు చాలా ఆనందం. నాకు తెలుగు అనే మూడక్షరాలు వింటే నా రక్తం ఉప్పొంగుతుంది. యన్.టి.ఆర్. అని వింటే నాకు మనసు ఉల్లాసంగా ఉంటుంది. ఏకాక్షరంతో తెలుగులో పద్యాలు చెప్పగల సత్తా మనది. తమన్గారు నాలుగు పాటలు చాలా బాగా ఇచ్చారు. ఇవాళ సంగీతం అనేది సంగీతం హిట్ అయితే, సినిమా సగం హిట్ అయినట్టే లెక్క. నేనూ, మా తారక్ చేసే సినిమాలు చేయడం ఇతరుల వల్ల కావు. అలా చేయడం అసాధ్యం. అవన్నీ జీవితం కన్నా పెద్దవి. మన జీవితాల్లో భూతద్దం పెట్టి చూస్తేనే తెలుస్తాయి. మా సినిమాల్లో నవరసాలూ ఉండాలని కోరుకుంటారు ప్రేక్షకదేవుళ్లు. అందుకే మా పాత్రలు కూడా అలాగే ఉంటాయి. రీరికార్డింగ్ కూడా బలంగా ఇచ్చారు తమన్. సమష్టి కృషితో ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. ఈ సినిమాకు కష్టపడిన ప్రతి ఒక్కరికీ అభినందనలు`` అని అన్నారు.