సుధీర్బాబు, అదితీరావు హైదరి జంటగా మోహన్కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన చిత్రం `సమ్మోహనం`. శ్రీదేవి మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 10గా తెరకెక్కుతోన్న `సమ్మోహనం` జూన్ 15న విడుదలైంది. సినిమా సక్సెస్ అయిన సందర్భంగా చిత్ర యూనిట్ బుధవారం సక్సెస్మీట్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో సుధీర్ బాబు, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్, నరేశ్, పవిత్రా లోకేశ్, తనికెళ్ళభరణి, పి.జి.విందా, రాహుల్ రామకృష్ణ, కాదంబరి కిరణ్, రమేశ్ రెడ్డి, మార్తాండ్ కె.వెంకటేశ్, హర్షిణి, తరుణ్ భాస్కర్, వివేక్ సాగర్, రామజోగయ్యశాస్త్రి నందు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ - ``సూపర్స్టార్ ఫ్యామిలీ నుండి వచ్చి సినిమా చేస్తున్నాడు కదా!.. అని సామాన్యుడు వీడేంటో అని దూరంగా ఉండిపోయారు. అలాంటి సామాన్యులకు నన్ను దగ్గర చేసిన చిత్రం `సమ్మోహనం`. `ప్రేమకథా చిత్రమ్` నాకు చాలా మంచి హిట్ చిత్రంగా నిలిచింది. దాని తర్వాత కూడా నేను చాలా మంచి సినిమాలు చేశాను. అయినా కూడా నన్ను ప్రేమకథా చిత్రమ్ సుధీర్బాబు అని పిలిచేవారు. చాలా మంచి సినిమాలు చేసినా ఇంకా అందరూ అలాగే భావిస్తున్నారేంటి అని అనుకునేవాడిని. ఈ `సమ్మోహనం` చిత్రం వాటన్నింటినీ తుడిచేసింది. ఇకపై సమ్మోహనం సుధీర్బాబు అంటారు. అలాగే మహేశ్ బావగా నాకు దగ్గరే కానీ.. యాక్టర్గా కాస్త గ్యాప్ ఉండేదనిపించేది. `సమ్మోహనం` ఓ యాక్టర్గా నన్ను తనకు దగ్గర చేసింది. నా గురించి చెప్పేటప్పుడు ఇప్పుడు తన కళ్లలో ఓ మెరుపు కనపడతుంది. ఇంత మంచి సినిమా ఇచ్చిన ఇంద్రగంటిగారికి థాంక్స్. అలాగే కృష్ణ ప్రసాద్గారి ఉక్కు మనిషి. ప్రతిరోజూ సెట్లో ఉంటూ అందరికీ వసతులు బావున్నాయా? లేవా? అని దగ్గరుండి చూసుకునేవారు. ఈ సినిమా ప్రారంభం నుండి కృష్ణగారు, చిరంజీవిగారు, మహేశ్గారు ఎంతగానో సపోర్ట్ చేశారు. సినిమా ఓవర్ సీస్లోకూడా మంచి కలెక్షన్స్ రాబట్టుకుంటుంది. ఇప్పటికే హాఫ్ మిలియన్ను వసూళ్లు సాధించింది. మిగతా స్క్రీనింగ్స్ పూర్తయ్యేసరికి మిలియన్ డాలర్స్ వసూళ్లు అవుతాయని అంటున్నారు. నరేశ్గారిని ఈ సినిమా చేసే సమయంలో నిజమైన నాన్నగానే భావించి చేశాను. ఇక ఇంద్రగంటిగారు భాషను ప్రేమించేంతలా భార్యను కూడా ప్రేమించరు. చాలా మంచి సినిమాను ఇచ్చారు. అలాగే సినిమాలో నటించిపవిత్రాలోకేశ్, అదితిరావు హైదరి సహా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, సినిమాను పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్`` అన్నారు.
నరేశ్ మాట్లాడుతూ - ``200 సినిమాల్లో నటించాఉ. 30-40 సినిమాలకు ప్రొడక్షన్ చేశాను. వేల సినిమాలు చూశాను. కథ విన్న రోజు నుండి సినిమా ఎపిక్ హిట్ అవుతుందని చెబుతూనే ఉన్నాను. నేను అన్నట్టుగానే సినిమా ఎపిక్ హిట్ అయ్యింది. ఈ సినిమా చాలా రకాలుగా ఇన్స్పైర్ చేసింది. తెలుగు భాష గొప్పతనాన్ని అండర్ కరెంట్ మెసేజ్లా ఇచ్చింది. ఎలాంటి తప్పులు లేని సినిమా రావడం అరుదుగా జరుగుతుంటాయి. అలాంటి అరుదైన చిత్రాల్లో ఇదొకటి. ఈ సినిమాకు ఇంద్రగంటిగారు సమ్మోహనకర్తగా నిలిచారు. జంధ్యాలగారికి రీప్లేస్మెంట్ ఉండదు. ఆయనలాగానే ఇంద్రగంటిగారికి కూడా రీప్లేస్మెంట్ లేదు. ప్రతి ఆర్టిస్ట్ను లొకేషన్లో మోటివేట్ చేస్తూ ఉండేవారు. ఇక మా శివలెంక కృష్ణ ప్రసాద్గారితో మంచి అనుబంధం ఉంది. ఆదిత్య 369 చేసిన ఈయన మళ్లీ ఈ జనరేషన్కు తగినట్లు జెంటిల్మన్, సమ్మోహనం సినిమాలు చేయడం గొప్ప విషయం. అందుకే ఆయన లెజెండ్రీ ప్రొడ్యూసర్ అయ్యారు. వివేక్సాగ్ మంచి నేపథ్య సంగీతాన్ని అందించడంతో పాటు.. మెలోడీ మ్యూజిక్కి కొత్త అర్థాలను చెప్పేలా మంచి సంగీతాన్ని అందించాడు. సుధీర్బాబు ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తనలో ఇన్టెన్షన్ చూసి మహేశ్లా చేశావని నేను తనతో అన్నాను కూడా. పవిత్రాలోకేశ్గారు ఎన్నో పాత్రలు చేసినా.. ఈ సినిమా ఆమెకు గుర్తుండిపోతుంది. అదితిరావు హైదరి చక్కగా నటించింది. ఆమె రూపంలో ఓ మంచి హీరోయిన్ తెలుగు ఇండస్ట్రీకి దొరికింది. నందు, రమేశ్ రెడ్డి, రాహుల్ రామకృష్ణ ఇలా అందరికీ సమ్మోహనం గుర్తుండి పోతుంది. నా విషయానికి వస్తే.. నా చిత్రం భళారే విచిత్రం సినిమా ఈ సినిమా వరకు చూస్తే.. సమ్మోహనం నా కెరీర్ బెస్ట్ మూవీ అని అప్రిషియేషన్స్ వస్తున్నాయి. సినిమా థియేటర్లో ఓ పెద్దాయన అప్పట్లో మరో చరిత్ర ఎలాగో.. ఈ తరానికి ఇదొక మరోచరిత్ర అని అనడాన్ని నేను మరచిపోలేను`` అన్నారు.
ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ - ``2012లో ఈ కథను రాసుకున్నాను. మధ్యలో కొందరికి ఈ కథను చెప్పాను కూడా.. అయితే శివలెంక కృష్ణ ప్రసాద్గారు కథను విగానే సినిమా చేస్తామని చెప్పారు. అంతే కాకుండా నాపై, కథపై నమ్మకంతో ఈరోజు వరకు ఆయన సినిమా చూడలేదు. అలాగే సుధీర్బాబుకి కూడా థాంక్స్. ఎందుకంటే కథ వినగానే ఒప్పుకోవడమే.. నమ్మకంతో, చాలెంజింగ్గా తీసుకుని ఆ పాత్రలో నటించారు. అదితిరావు హైదరి, సుధీర్ పోటాపోటీగా నటించారు. సాధారణంగా మ్యూజిక్ డైరెక్టర్ వివేక్సాగర్ కథ నచ్చకపోతే సినిమా చేయడని అంటుంటారు. అలాంటి వివేక్ నా కథ వినగానే సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. అదే ఎగ్జయిట్మెంట్ ఈరోజు వరకు తనలో కనపడుతుంది. విందా నా కళ్లు..తను అమ్మాయి అయితే పెళ్లి చేసుకునేంత మంచి అనుబంధం మా మధ్య ఉంది. అందుకే నేను చెప్పేవాటిని అర్థం చేసుకుని అందంగా తెరపై చూపిస్తుంటారు. తనికెళ్ళభరణిగారు చిన్న పాత్రలో నటించినా.. నేను అడిగానని సినిమా మొత్తం నాకు సహకారాన్ని అందిస్తూ వచ్చారు. అలాగే మార్తాండ్ కె.వెంకటేశ్గారు నా మనసు.. ఆయన విజన్పై నమ్మకం ఉంది. అది ఈరోజు మరోసారి ప్రూవ్ అయ్యింది. నిజానికి తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన పెళ్ళిచూపులు సినిమాలో ఓ సన్నివేశం చూసి అరే! మనం కూడా ఇలా ఓ కథను రాస్తే బావుంటుంది కదా.. అనిపించి.. ఆ ఇన్స్పిరేషన్తో ఈ కథను తయారు చేసుకున్నాను. సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్`` అన్నారు.
శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ - ``ఇంద్రగంటిగారు మరోసారి మా బ్యానర్కి సక్సెస్ ఇచ్చారు. ఓ మంచి సినిమాను నిర్మించినందుకు నిర్మాతగా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇలాంటి మంచి సినిమాను నేను చేయడానికి కారణమైన హీరో సుధీర్బాబుగారికి, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణకు థాంక్స్. అలాగే అదితిరావు హైదరి, నరేశ్గారు, పవిత్రా లోకేశ్గారు, రాహుల్ రామకృష్ణ, మార్తాండ్ కె.వెంకటేశ్, హర్షిణి ఇలా నటీనటులు, వివేక్ సాగర్, పిజి.విందా వంటి సాంకేతిక నిపుణులు అలాగే సపోర్ట్ చేసిన డైరెక్షన్ టీమ్, ప్రొడక్షన్ టీంకి థాంక్స్`` అన్నారు.
పవిత్రా లోకేశ్ మాట్లాడుతూ - ``ఓ మంచి సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. ఇలాంటి సినిమాలో ఓ మంచి పాత్రను నాకు ఇచ్చిన దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటిగారికి, నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్గారికి థాంక్స్. నా కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ రోల్ అని భావిస్తున్నాను`` అన్నారు.
వివేక్ సాగర్ మాట్లాడుతూ - ``నేను ఇంత మంచి మ్యూజిక్ చేయడానికి కారణం ఇంద్రగంటిగారే. నిర్మాత కృష్ణప్రసాద్గారు మంచి సపోర్ట్ చేశారు. సినిమా చాలా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సక్సెస్లో భాగమైన అందరికీ అభినందనలు`` అన్నారు.
తరుణ్భాస్కర్ మాట్లాడుతూ - ``సాధారణంగా వివేక్ కథ నచ్చకపోతే సంగీతం చేయడానికి అంగీకరించడు. తను ఓకే చెప్పాడంటే కథలో ఏదో విషయముండే ఉంటుంది. నాలాంటి ఫిలిమ్ మేకర్స్కి ఇంద్రగంటిగారు ఇన్స్పిరేషన్`` అన్నారు.
హర్షిణి మాట్లాడుతూ - ``ముందు చెల్లెలి పాత్ర చేయాలంటే ఆలోచించాను. నాకు కూడా ఇంద్రగంటిగారు కథ చెప్పారు. వినగానే ఓకే చెప్పేశాను. ఈరోజు అందరూ బాగా నటించావని అప్రిషియేట్ చేస్తున్నారంటే ఇంద్రగంటిగారే కారణం`` అన్నారు.
రాహుల్ రామకృష్ణ మాట్లాడుతూ - ``సినిమా గురించి గొప్పగా చెప్పడానికి ఏమీ లేదు. దాన్ని ప్రేక్షకులు ప్రూవ్ చేశారు. సినిమాలో భాగమైన అందరికీ అభినందనలు``అన్నారు.
మార్తాండ్ కె.వెంకటేశ్ మాట్లాడుతూ - ``నేను 400 సినిమాలకు పనిచేశాను. నేను పనిచేసిన బెస్ట్ సినిమాల్లో ఇదొకటి`` అన్నారు.