వరుణ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా నటించిన సినిమా `తొలి ప్రేమ`. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. బీవీయస్యన్ ప్రసాద్ నిర్మాత. బాపినీడు సమర్పించారు. ఈ సినిమా థాంక్స్ మీట్ బుధవారం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న
బీవీయస్యన్ ప్రసాద్ మాట్లాడుతూ ``ఈ సినిమాను నమ్మి చేశాను. ఈ చిత్రానికి నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ బాగా సెట్ అయ్యారు`` అని అన్నారు.
దిల్రాజు మాట్లాడుతూ ``ప్రతి టెక్నీషియనూ తమ వంతుగా ఈ సినిమాకు అత్యుత్తమంగా కృషి చేశారు. వెంకీ ఒక రోజు నా ముందు కూర్చుని ఈ కథను బీవీయస్యన్గారితో చేయడానికి సిద్ధమైనట్టు చెప్పారు. నేను సరేననుకున్నా. ఒక అసిస్టెంట్ డైరక్టర్ వెయిటింగ్లో ఉన్నప్పుడు పడే ఆవేదన నాకు తెలుసు. ఎమోషన్స్, రిలేషన్స్ నాకూ బీవీయస్యన్ కుటుంబానికి మధ్య బాగా ఉన్నాయి. అందుకే ఈ సినిమా మరలా నా చేతుల్లోకి వచ్చింది. కరుణాకరన్ పవన్కల్యాణ్ గారితో `తొలిప్రేమ`ను క్రియేట్ చేస్తే, ఇప్పుడు వెంకీ అట్లూరి మరలా క్రియేట్ చేశారు. `ఫిదా` తర్వాత వరుణ్ తేజ్ మరలా ఈ సినిమాలో చాలా బాగా చేశారు. మూడు పాత్రల్లో తను చూపించిన వైవిధ్యం అందరినీ మెప్పించింది`` అని అన్నారు.
వెంకీ అట్లూరి మాట్లాడుతూ ``నా తొలి అటెంప్ట్ ని ఆదరించినందుకు ధన్యవాదాలు. కెమెరామేన్ జార్జి నాకు చాలా స్పెషల్. ఈ సినిమాకు చాలా కష్టపడ్డారు. రాశీని ఈ సినిమాలో చూసిన వారందరూ ఇంట్లో అమ్మాయిలా ఇష్టపడుతుండటం నాకు చాలా బాగా నచ్చింది. వరుణ్ నమ్మడం వల్లే ఈ సినిమా పురుడుబోసుకుంది`` అని చెప్పారు.
రాశీఖన్నా మాట్లాడుతూ ``ఈ సినిమాకు వచ్చిన రివ్యూలన్నీ చదివాను. ట్విట్టర్లోనూ నన్ను వర్ష అని పిలుస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన వెంకీ అట్లూరికి ధన్యవాదాలు. ఈ సినిమాతో నాకు ఫీమేల్ ఫ్యాన్స్ కూడా పెరిగారు. టీమ్ అంతా కష్టపడి పనిచేశాం. రిపీటెడ్ ఆడియన్స్ వచ్చి మా సినిమాను చూస్తుంటే ఆనందంగా ఉంది`` అని తెలిపారు.
వరుణ్ తేజ్ మాట్లాడుతూ ``ఈ సినిమా కథని అందరూ నమ్మి చేశారు. అందరికన్నా ముందు దిల్రాజుగారు నమ్మారు. అట్లూరి వెంకీకి నేను రుణపడి ఉంటాను. వెంకీ చాలా ఇష్టపడి చేసుకున్న సబ్జెక్ట్ ఇది. ఆద్యంతం కన్విక్షన్ ఉంటుంది. చిరంజీవిగారు సినిమా చూసి షాక్ అయ్యారు. డెబ్యూ డైరక్టర్ ఇంత బాగా చేశారా అని చిరంజీవిగారు షాక్ అయ్యారు. సినిమా విడుదలయ్యాక నాది, రాశీ ఖన్నాది ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బావుందని చాలా మంది అంటున్నారు. ఆఫ్ స్క్రీన్ జార్జి, తమన్, వెంకీ అట్లూరి మధ్య బాండింగ్ చాలా బావుంటుంది. సినిమాను వారు ప్రేమించిన విధానం, చేసిన హార్డ్ వర్క్ ఈ సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుంది. ప్రతి టెక్నీషియన్ చాలా బాగా చేశారు`` అని చెప్పారు.
స్వప్న మాట్లాడుతూ ``ఈ సినిమాలో సెకండాఫ్లో కనిపిస్తాను. సినిమా చూసిన వారందరూ నన్ను మెచ్చుకుంటూ ఉంటే ఆనందంగా ఉంది`` అని అన్నారు.
తమన్ మాట్లాడుతూ ``మా నిర్మాతగారు బొద్దుగా ఉంటారు. ఆయన మనసంతా ప్రేమతో నిండి ఉంటుంది. టెక్నీషియన్లను ఎక్స్ ట్రా కేర్ తీసుకుని సినిమా చేస్తుంటారు. సంగీతం సక్సెస్లో సగం నేను ఆయనకే ఇస్తాను. ఫక్తు కమర్షియల్ సినిమా ఇది. సినిమా రీరికార్డింగ్కి వచ్చినప్పుడు చూడగానే పీల్ నచ్చింది. చాలా జాగ్రత్తగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చేశాను`` అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో బాపినీడు, కెమెరామేన్ జార్జి, హైపర్ ఆది, ఆర్ట్ డైరక్టర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.