కంగనా రనౌత్ టైటిల్ ప్రాతలో నటించిన చిత్రం 'మణికర్ణిక'. జీ స్టూడియోస్ , కమల్ జైన్ నిర్మాణంలో జాగర్లమూడి క్రిష్, కంగనా రనౌత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జనవరి 25న విడుదలవుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో...
ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ - ''మన స్వాతంత్య్రం కోసం పోరాడిన వీరుల చరిత్రను తెరకెక్కించిన జీ స్టూడియో వారిని, కంగనా రనౌత్ను అభినందిస్తున్నాను. ఒకప్పుడు మేం హిందీ సినిమాల్లోకి ఎప్పుడూ వెళ్దామా అని ఎదురు చూస్తే.. బాలీవుడ్ వాళ్లు హాలీవుడ్లోకి ఎప్పుడు వెళ్దామా అని ఎదురుచూసేవాళ్లు. ఎల్.వి.ప్రసాద్ నుండి రాంగోపాల్ వరకు మన తెలుగు ఖ్యాతిని చాటినవాళ్లు ఎందరో ఉన్నారు. ఇప్పుడు మణికర్ణికను కథ, స్క్రీన్ప్లే విజయేంద్ర ప్రసాద్ అని చూసిన తర్వాత.. దర్శకుడు జాగర్లమూడి క్రిష్ అని చూసిన తర్వాత చాలా సంతోషంగా అనిపించింది. యాక్షన్ పార్ట్ను డైరెక్ట్ చేసిన కంగనా రనౌత్గారిని హృదయ పూర్వకంగా అభినందిస్తున్నాను. బ్లాక్బస్టర్ చిత్రాలను అందించిన గొప్ప రచయిత విజయేంద్ర ప్రసాద్. కేవలం తెలుగులోనే కాదు, తమిళం, కన్నడ సహా హిందీలో గొప్ప చిత్రాలను అందించారు. ఇప్పుడు మణికర్ణిక రూపొండంలో ఆయన కీలకభూమిక పోషించారు. భారతదేశ స్వాతంత్య్రం కోసం ప్రథమ స్వాతంత్య్ర పోరులో పోరాడిన ఝాన్సీ రాణి కథను తెరకెక్కించిన యూనిట్కు ఆల్ ది బెస్ట్'' అన్నారు.
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ - ''భారతదేశమే కాదు.. ప్రపంచమంతా తిరిగి చూసిన బాహుబలి సినిమాకు కథను అందించింది విజయేంద్ర ప్రసాద్గారు. ఎప్పటికప్పుడూ రికార్డ్స్ బ్రేక్స్ చేసే కథలను అందిస్తూ దేశమంతా కూడా కంగారు పుట్టించేలా బాహుబలిని అందించారు. ఇప్పుడు మణికర్ణికను అందించారు. ఆమె పెద్ద ఎత్తు లేకపోయినా.. కానీ నటన పరంగా ఆకాశమంతా ఎత్తు ఎదిగింది. ఏ సినిమాకు ఆ సినిమాలో కొత్తగా కనపడుతూ వచ్చింది. క్రిష్ నెల రోజుల్లో మూడు సినిమాలను రిలీజ్ చేస్తున్నాడు. అతను వదిలిపెట్టిన బాణంలాంటి ఈ సినిమాను కంగనారనౌత్ పూర్తి చేసింది. ఎంటైర్ యూనిట్కు అభినందనలు'' అన్నారు.
కంగనా రనౌత్ మాట్లాడుతూ - ''తెలుగులో ట్రైలర్ ఇంతకు ముందుగానే చూశాను. సౌండింగ్ డిఫరెంట్గా అనిపించింది. అయితే క్యారెక్టర్స్కు తెలుగు వాయిస్ అందించిన ప్రతి ఒక్కరూ న్యాయం చేశారు. విజయేంద్ర ప్రసాద్గారు కూడా ట్రైలర్ మీద వర్క్ చేశారు. తెలుగులో ఓ పవర్ ఉంటుంది. అందుకే నేను బాహుబలిని తెలుగులో, హిందీలో కూడా చూశాను. నేను ఈ సినిమాను డైరెక్ట్ చేయడమనేది ప్లానింగ్ ప్రకారం జరగలేదు. యాక్సిడెంటల్గా జరిగింది. ఆగస్ట్లో రావాల్సిన ఈ సినిమాను అనుకున్న సమయంలో పూర్తి చేయలేకపోయాం. ఆ సమయంలో క్రిష్గారు మరో ప్రాజెక్ట్ 'యన్.టి.ఆర్' పూర్తి చేయాల్సి ఉంది. కాబట్టి సినిమాను జనవరిలో పూర్తి చేయాలని నేను డైరెక్ట్ చేశాను. క్రిష్గారు సినిమాను గొప్పగా తెరకెక్కించారు. ఆయన్ను నేను ఫాలో అయ్యానంతే. టీం సహకారంతో సినిమాను పూర్తి చేశాను. తదుపరి కూడా నేను డైరెక్ట్ చేయాలనుకుంటున్నాను. ఆ సినిమాకు విజయేంద్ర ప్రసాద్గారిని కథను అందించమని చెప్పాను. తప్పకుండా మేం కలిసి పనిచేస్తాం. రెండు నెలలు సినిమా కోసం చాలా కష్టపడ్డాను. మనం కోసం రక్తం ధారపోసిన వారి గురించి పట్టించుకోవడం లేదు. వారు మన చరిత్ర. అలాంటి వారికి గౌరవం ఇవ్వాలి. అలా చరిత్ర మరుగున పడిపోయిన ఎందరో వీరులున్నారు. అలాంటి కారణంతోనే ఝాన్సీ కథను సినిమాగా చేయాలని అనుకున్నాను. ఈ సినిమా మేకింగ్లో చాలా సమస్యలను ఫేస్ చేశాను. షూటింగ్ ప్రారంభంలోనే నా నుదుటికి గాయమైంది. అలాగే డైరెక్టర్గా మారాలని కమల్గారు చెప్పినప్పుడు కూడా నేను ఇంత పెద్ద సినిమాను హ్యాండిల్ చేయగలనా అనే సందేహం కలిగింది. అలాంటి సమయంలో చాలా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను'' అన్నారు.
నిర్మాత కమల్ జైన్ మాట్లాడుతూ - ''ప్రస్తుతం చాలా బయోపిక్స్ రూపొందుతున్నాయి. వాటి సక్సెస్ శాతం కూడా ఎక్కువగానే ఉంది. ఇప్పటి వరకు వచ్చిన బయోపిక్స్కు మణికర్ణికను మదర్ ఆఫ్ బయోపిక్స్ అని చెప్పొచ్చు. ఈ సినిమాను చేసే సమయంలో చాలా స్ట్రగుల్స్ను ఫేస్ చేశాం. వాటన్నింటినీ దాటి చేసిన సినిమా ఇది. విజయేంద్ర ప్రసాద్గారు అద్భుతమైన స్క్రిప్ట్ను అందించారు. చాలా మంచి టీం దొరికింది కాబట్టి సినిమాను పూర్తి చేశాం'' అన్నారు.