14 October 2014
Hyderabad
హుదూద్ తుఫాన్ బాధితులకు స్టైలిష్స్టార్ అల్లు అర్జున్ రూ.20 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రస్తుతం కొచ్చిన్ లో ఉన్న అల్లు అర్జున్ హుదూద్ తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్ర కకావికలమైందన్న వార్త తనను కలిచి వేసిందని అర్జున్ పేర్కొన్నారు. టీవీల్లో తుఫాన్ వార్తలు తెలుసుకున్న ఆయన వారు పడుతున్న బాధలతో తీవ్ర ఆవేదనకు గురైనట్టు చెప్పాడు.
తనవంతు సాయంగా సిఎం రిలీఫ్ ఫండ్ కు తక్షణమే రూ.20 లక్షలు ఇస్తున్నానని చెప్పారు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ... ఆదివారం సంభవించిన హుదుద్ తుఫాన్ భీభత్సంతో... నాకెంతో ఇష్టమైన విశాఖపట్నం రూపురేఖలను మార్చేయడం దురదృష్టకరం.
ముఖ్యంగా రైతులు, మధ్యతరగతివారు, మత్స్యకారులు తీవ్రంగా నష్ట పోయారు. నేను ప్రకటించిన 20 లక్షల ఆర్థిక సాయంలో ఎక్కువ భాగం సముద్రాన్నే నమ్ముకుని జీవించే మత్స్యకారుల కోసం ఉపయోగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా.
తుఫాన్ ప్రభావంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారు. వారి వలలు, పడవలు ధ్వంసమవ్వడంతో జీవనోపాధి దెబ్బతినడం నన్ను కలచివేసింది. మెగాభిమానులు సైతం తుఫాను సహాయక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని తోచినంత సాయం చేయాల కోరుతున్నా. అని అన్నారు.