2 December 2017
Hyderabad
గోపీచంద్ కథానాయకుడిగా ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఆక్సిజన్'. గోపీచంద్ సరసన రాశి ఖన్నా, అను ఇమ్యాన్యుయేల్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీసాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మించారు. సినిమా నవంబర్ 30న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్మాత ఎ.ఎం.రత్నం ఇంటర్వ్యూ..
సక్సెస్ రెస్పాన్స్ ఎలా ఉంది?
- చాలా బావుంది...విడుదలైన శుక్రవారంకి ఈరోజుకి కలెక్షన్స్ పెరిగాయి. సినిమా చూసిన కొంత మంది నాకు ఫోన్ చేసి మంచి మెసేజ్ ఇచ్చారని అప్రిసియేట్ చేశారు. ఇప్పుడు కూడా అలాంటి అప్రిసియేషన్సే వస్తున్నాయి.
జ్యోతికృష్ణ కథ చెప్పగానే ఏమనిపించింది?
- కథ విని నచ్చి సినిమా తీయాలనే ఆలోచన నాకు ముందుగా లేదు. జ్యోతికృష్ణ నాకు కథ చెప్పకముందే గోపీచంద్కు కథ చెప్పాడు. గోపీచంద్కు నచ్చడంతో తనే నాకు ఫోన్ చేసి `కథ బావుంది..మీరు వినండి..నచ్చితే సినిమా చేద్దాం` అని అన్నారు. అంతకు ముందు మేం నిర్మించిన వేదాళం సినిమా సమయంలో..ఆ సినిమా డైరెక్టర్ శివ ఈ కథ విని బావుంది సినిమా చేయమని సలహా ఇచ్చారు. అంతే కాకుండా తనే గోపీచంద్కు రెఫర్ చేశారు కూడా.
`ఆక్సిజన్` చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయాలనుందని జ్యోతికృష్ణ అన్నారు?
అవును ఆలోచనైతే ఉంది..మంచి మెసేజ్ ఉన్న చిత్రం కాబట్టి తమిళంకే కాదు, ఏ భాషలో అయినా రీమేక్ చేయవచ్చు. నా స్నేహితుడొకరు బెంగళూర్లో సినిమా చూసి హిందీలో అక్షయ్కుమార్, అజయ్ దేవగణ్ వంటి హీరోతో ఈ సబ్జెక్ట్ను రీమేక్ చేయవచ్చునని, సినిమా బావుందని అన్నారు. నేను కూడా ఈ సినిమాను కన్నడంలో శివరాజ్కుమార్గారికి చూపిద్దామని అనుకున్నాను. కానీ ఆయన సిటీలో లేకపోవడంతో కుదరలేదు.
పవన్ కల్యాణ్తో సినిమా ఎప్పుడు ఉంటుంది?
- సినిమా ఉంటుంది. ప్రస్తుతం పవన్గారు షూటింగ్లో బిజీగా ఉన్నారు. పూర్తి కాగానే కలుస్తానని అన్నారు.
సినిమా బాగా ఆలస్యమైంది కదా?
- మా సినిమా కంటే ముందు గోపీచంద్ పెండింగ్లోని మూవీ `ఆరడుగుల బుల్లెట్`ను విడుదల చేయాలనుకున్నారు. ఆ సినిమా ఏదో సమస్యలను పేస్ చేసింది. తర్వాత గౌతమ్ నందను విడుదల చేస్తామని గోపీచంద్గారే అన్నారు. ఇలా కొన్ని కారణాలతో సినిమా ఆలస్యమైందే తప్ప..మరే కారణం కాదు.