13 January 2015
Hyderabad
‘ధనం మూలం ఇదం జగత్’ డబ్బుతో ఈ ప్రపంచంలో ఏదైనా కొనొచ్చు. ఒక ప్రాణాన్ని తప్ప. డబ్బుకు వున్న ప్రాముఖ్యత అలాంటిది. ఈ సిద్ధాంతాన్ని నమ్ముకున్న ముగ్గురు వ్యక్తుల జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి? వారు తమ లక్ష్యాలను ఎలా చేరుకున్నారు? అనే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందిన చిత్రమే మా ‘భమ్ బోలేనాథ్’ అన్నారు దర్శకుడు దండు కార్తీక్వర్మ. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భమ్ బోలేనాథ్’. ఆర్.సి.సి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శిరువూరి రాజేష్వర్మ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నవదీప్, నవీన్చంద్ర, ప్రదీప్ కథానాయకులు. పూజ, ప్రాచీ కథానాయికలు. ఈ నెలాఖరులో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ఆడియో సక్సెస్ వేడుక ఈ నెల 14న విజయవాడలోని హాలెండ్ రిసార్ట్స్లో జరగనుంది. ఈ సందర్భంగా దర్శకుడు మరిన్ని విశేషాలను తెలియజేస్తూ ‘ ఒకదానికొకటి సంబంధం లేని మూడు విభిన్నమైన కథలతో... ముగ్గురు వ్యక్తుల జీవన ప్రయాణం ఇతివృత్తంగా తెరకెక్కిన క్రైమ్ కామెడీ మూవీ ఇది. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకం వుంది’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘కార్తికేయ’ తర్వాత మా సంస్థ నుంచి వస్తున్న మరో వైవిధ్యమైన చిత్రమిది. క్రైమ్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు ఆసక్తిని కలిగిస్తుంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. అందరికి నచ్చుతుందనే విశ్వాసముంది’ అని అన్నారు.