28 March 2018
Hyderabad
నందమూరి కల్యాణ్రామ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం `ఎమ్మెల్యే`. ఉపేంద్ర మాధవ్ దర్శకత్వం వహించిన చిత్రమిది. బ్లూ పానెట్ పతాకంపై భరత్ చౌదరి, కిరణ్ రెడ్డి నిర్మించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కూడా చిత్ర నిర్మాణంలో అసోసియేట్ అయింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం గురించి భరత్చౌదరి, కిరణ్ రెడ్డి బుధవారం విలేకరులతో మాట్లడారు.
భరత్ చౌదరి మాట్లాడుతూ ``నేను బేసిగ్గా డిస్ట్రిబ్యూటర్ని. కిరణ్గారితో ఎప్పటి నుంచో పరిచయం ఉంది. మేం కలిసి `నేనే రాజు నేనే మంత్రి` కూడా చేశాం. `ఎమ్మెల్యే` మేం తెరకెక్కించిన రెండో చిత్రం. మా రెండు సినిమాలూ చాలా బాగా ఆడినందుకు ఆనందంగా ఉంది. కథను నమ్మి సినిమాలు చేస్తున్నాం. మా దర్శకుడు మంచి కథ ఉందని మమ్మల్ని ఫోనులో సంప్రదించే ప్రయత్నం చేశాడు. కల్యాణ్రామ్గారికి కూడా కథ చెప్పి ఒప్పించారు. నిర్మాతలు ఎవరంటే మా పేరు చెప్పారు. కల్యాణ్రామ్గారు వెంటనే అంగీకరించారట. అతనొక్కడే నుంచి నాకు కల్యాణ్రామ్గారితో మంచి అనుబంధం ఉంది. దాంతో మేం కూడా వెంటనే సినిమాను మొదలుపెట్టాం. సినిమా మొదలుపెట్టినప్పుడు ఉన్న క్రేజ్ కంటే టీజర్, ట్రైలర్ విడుదలైన తర్వాత క్రేజ్ మరింత పెరిగింది. కల్యాణ్గారు మా సినిమాలో చాలా అందంగా కనిపించారని అందరూ అన్నారు. అలాంటి మేకోవర్ మా సినిమాలో వచ్చినందుకు ఆనందంగా ఉంది. హిందీ, తెలుగు శాటిలైట్ రైట్స్ కలిపి రూ.7కోట్లు వచ్చాయి. ఆంధ్రాలో మా సన్నిహితులు విడుదల చేశారు. మిగిలిన చోట్ల సురేశ్బాబుగారి సహకారంతో విడుదల చేశాం. అందరం చాలా హ్యాపీగా ఉన్నాం`` అని చెప్పారు.
కిరణ్ రెడ్డి మాట్లాడుతూ ``ప్రపంచం మొత్తం సినిమాలు చూస్తారు.. అందుకే బ్లూ ప్లానెట్ అనే పేరు పెడితే బావుంటుందనే ఉద్దేశంతో మేం బ్లూ ప్లానెట్ అనే సంస్థను ప్రారంభించాం. నాకు మైనింగ్ బిజినెస్లున్నాయి. మంచి కథతోనే సినిమాలు చేయాలన్నది నా సంకల్పం. రానాతో `నేనే రాజు నేనే మంత్రి`, కల్యాణ్రామ్తో `ఎమ్మెల్యే` అలా తీసినవే. ఎమ్మెల్యేలో పిల్లల చదువు గురించి, చైల్డ్ లేబర్ గురించి చాలా విషయాలు చెప్పాం. సినిమా పరిశ్రమలోకి వచ్చేవారు డబ్బులు సంపాదించాలని కాకుండా, ప్యాషన్తో సినిమాలు చేయాలని వస్తే బావుంటుంది. ప్రస్తుతం అల్లరి నరేశ్, సునీల్తో ఓ సినిమా చేస్తున్నాం. ఇంకా పేరు పెట్టలేదు. 70శాతం షూటింగ్ పూర్తయింది`` అని అన్నారు.