సునీల్ కుమార్ రెడ్డి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `గల్ప్`. యెక్కలి రవీంద్రబాబు, రమణీకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చేతన్ మద్దినేని కథానాయకుడు. డింపుల్ కథానాయిక. ప్రస్తుతం గల్ప్లో చిత్రీకరణ జరుగుతోంది.
దర్శకుడు మాట్లాడుతూ ``గల్ఫ్ లో తెరకెక్కిస్తున్న తాజా షెడ్యూల్ ఈ నెలాఖరుతో పూర్తవుతుంది. గల్ఫ్, రసల్ ఖైమా, షార్జా, అజ్మాల్ తదితర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. హీరో చేతన్ మద్దినేని, హీరోయిన్ డింపుల్, సంతోష్ పవన్, అనిల్ కల్యాణ్, శివ, దిగ్విజయ్, తిరుపతి, అనురాధ, కిశోర్బాబు, శ్రీరామ్ తదితరులు షెడ్యూల్లో పాల్గొంటున్నారు. క్లైమాక్స్ తప్ప మిగిలిన షూటింగ్ అంతా పూర్తవుతుంది. నవంబర్లో రామోజీ ఫిల్మ్ సిటీలో క్లైమాక్స్ ను చిత్రీకరిస్తాం. అరబ్ నటులు జాసిమ్ హసన్ జుమా, అలీ, అహ్మద్ ఈ చిత్రంతో టాలీవుడ్కి పరిచయమవుతున్నారు`` అని అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ ``పిడికెడు మెతుకుల కోసం పొట్ట చేతబట్టుకుని గల్ఫ్ కి వెళ్తున్న వారి స్థితిగతులు ఎలా ఉన్నాయి? దూరపు కొండలు నునుపు అనే సామెతను మరిచిపోయి కన్నవారికి, కట్టుకున్నవాళ్లకి దూరంగా బతకాలనుకునే వారు గల్ఫ్లో జీవితాన్ని సుఖంగా గడుపుతున్నారా? భారంగా గడుపుతున్నారా? వంటి పలు అంశాలతో అల్లుకున్న కథే `గల్ఫ్`. ముళ్ల మధ్య గులాబీలు అందంగా వికసించినట్టు వ్యథలే కథగా మిగిలినా అందులోనూ ఓ స్వచ్ఛమైన ప్రేమ కథను చూపిస్తున్నాం. ఇందులో నాలుగు పాటలున్నాయి. `సరిహద్దు దాటిన ప్రేమకథ` అనే మా ఉపశీర్షికకు మంచి రెస్పాన్స్ వస్తోంది`` అని అన్నారు