దేశముదురు చిత్రంతో హీరోయిన్గా తెరంగేట్రం చేసిన బబ్లీ బ్యూటీ హన్సిక తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. దేనికైనా రెడీ, పాండవులు పాండవులు తుమ్మెద చిత్రాల తర్వాత మంచు విష్ణు హీరోగా రూపొందిన చిత్రం `లక్కున్నోడు`లో మూడోసారి విష్ణుతో జత కట్టింది. లక్కున్నోడు జనవరి 26న విడుదలవుతుంది. విష్ణు మంచు హన్సిక జంటగా ఎం.వి.వి.సినిమా బ్యానర్పై గీతాంజలి, త్రిపుర వంటి హర్రర్ ఎంటర్టైనర్స్ ను తెరకెక్కించిన దర్శకుడు రాజ్ కిరణ్ దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మాతగా రూపొందిన చిత్రం `లక్కున్నోడు`.
ఈ సినిమా విడుదల సందర్భంగా హీరోయిన్ హన్సిక పాత్రికేయులతో మాట్లాడుతూ - `` తమిళంలో ఆరు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండటం వల్ల తెలుగులో ఎక్కువ సినిమాలు చేయలేకపోయాను. రవితేజ పవర్ సినిమా తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు లక్కున్నోడు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. ఇంతకు ముందు విష్ణు మంచుతో కలిసి దేనికైనా రెడీ, పాండవులు పాండవులు తుమ్మెద చిత్రాల్లో నటించాను. ఇది మా ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా. మాది హిట్ కాంబినేషన్. విష్ణుతో కలిసి నటించడాన్ని ఎప్పుడూ ఇష్టపడతాను. తను మా ఫ్యామిలీలో వ్యక్తిలా భావిస్తాను.
ప్రస్తుతం గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలో నటిస్తున్నాను. బస్తి అమ్మాయి పాత్రలో కనపడతాను. సంపత్ నందిగారు సినిమాను చక్కగా తెరకెక్కిస్తున్నారు. సినిమా బాగా వస్తుంది. ఇక లక్కున్నోడు సినిమా విషయానికి వస్తే రాజ్కిరణ్ చాలా ఫాస్ట్గా సినిమాను తెరకెక్కిస్తాడు. సినిమాను యాబై రోజుల్లోనే పూర్తి చేసేశారు డైరెక్టర్ రాజ్కిరణ్. ఒకప్పటితో పోల్చితే ముప్పై ఒక కిలోల బరువు తగ్గాను. సినిమాలతో పాటు నా వంతుగా సమాజానికి సపోర్ట్ చేయడానికి 31 మంది అనాథ పిల్లలను దత్తత తీసుకున్నాను. అనాథ పిల్లల కోసం శరణాలయం కట్టాలనుకుంటున్నాను. అందుకోసం ముంబై ల్యాండ్ కూడా కొన్నాను. రెండేళ్లలో ఈ పని పూర్తవుతుంది`` అన్నారు.