గోపీచంద్, మెహరీన్ హీరో హీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.చక్రవర్తి దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన చిత్రం `పంతం`. ఫర్ ఎ కాస్.. ఉప శీర్షిక. ఈ సినిమా జూలై 5న విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో గోపీచంద్తో ఇంటర్వ్యూ...
లెక్క పెట్టుకుని చేయలేదు...
- మన సోసైటీలో జరిగే ఓ ఇష్యూ గురించి మాకు తెలసినంత చెప్పడానికి ప్రయత్నించాం. సినిమా చూసే ప్రేక్షకులు కూడా అవును మన చుట్టూ ఈ సమస్య ఉంది కదా! దీన్ని సాల్వ్ చేస్తే బావుంటుంది కదా.. అనిపిస్తుంది. నేను 25 సినిమా ఇది అని లెక్క పెట్టుకోలేదు. స్టోరీ అంతా వినేసిన తర్వాత చూస్తే ఇదే నా 25వ సినిమా అయ్యింది. ప్రతి సినిమాకు ఫస్ట్ సినిమాయే. అయితే నా 25వ సినిమాగా ఇది సెట్ కావడం ఆనందంగా ఉంది. నాన్నగారు(టి.కృష్ణ) చేసినంత పవర్పుల్ స్టోరీ ఎందుకు చేయలేదు అని చాలా మంది అడిగారు. అందరికీ `అలాంటి కథ నా దగ్గరకు రాలేదు` అని చెబుతూ వచ్చాను. ఇప్పుడు పంతం నాన్నగారి సినిమాలా ఉంటుంది. అయితే ఇది పూర్తిస్థాయిలో అలాంటి చిత్రం కాదు. కానీ ఆ సోషల్ కాజ్ ఇందులో ఉంది. సినిమా అనేది పవర్ఫుల్ మీడియా. దాని ద్వారా ఓ మంచి చెప్తే రీచ్ అవుతుందనే నమ్మే వ్యక్తుల్లో నేను ఒకడిని. ఈ సినిమాతో అవకాశం నాకు దక్కింది.
డైరెక్టర్ చక్రి గురించి...
- చక్రి కథ చెప్పినప్పుడు తనను అడిగిన మొదటి ప్రశ్న.. `నువ్వు కథ బాగా చెప్పావ్.. అంత బాగా తీయగలవా?` అని. తను నవ్వుతూ `మీరు నాకు చాన్స్ ఇస్తే తప్ప నేను చెప్పలేను సార్` అన్నాడు. తను ఆ రోజు కథను ఎలాగైతే చెప్పాడో.. ఎగ్జిక్యూషన్ కూడా అలాగే చేశాడు. దీనికి ప్రసాద్ మూరెళ్లగారి అనుభవం కూడా తోడయ్యింది. చక్రి, ప్రసాద్గారు డిస్కస్ చేసుకుని సినిమాను చేశారు.
నిర్మాత రాధామోహన్ గురించి..
- నిర్మాత కె.కె.రాధామోహన్గారిని శ్రీధర్గారు పరిచయం చేశారు. కొత్త డైరెక్టర్ కదా.. ఎలా తీస్తాడోనని ఆయన ఆలోచించారు. `కథ వినండి, మీకు నచ్చితే ముందుకు వెళదాం` అన్నాను. ఆయనకు కథ నచ్చడంతో ఓ బడ్జెట్ ఫిక్స్ చేసుకుని సినిమాను పూర్తి చేశాం. ఇప్పుడు నిర్మాతగారు కూడా హ్యపీ. రాధామోహన్గారు ట్రాన్స్పరెంట్..మాటపై నిలబడే జెంటిల్మేన్.
ప్రతి సినిమాకు టెన్షన్ ఉంటుంది..
- నేను చేసిన 25 సినిమాల కథలు మంచివే. జయాపజయాలను పక్కన పెడితే.. మంచి కథలతోనే సినిమాలు చేశాను. ఎగ్జిక్యూషన్ సమస్య వల్ల సినిమా సరిగా సక్సెస్ అయ్యుండకపోవచ్చంతే. అయితే ప్రతి సినిమా విడుదల సమయంలో టెన్షన్ ఎలాగూ ఉంటుంది.
interview gallery
క్యారెక్టర్ గురించి..
- అందరూ బావుండాలని కోరుకునే పాత్ర. తన చుట్టూ జరిగే ఓ సమస్యను రూపుమాపడానికి తన వంతు ప్రయత్నం చేస్తాడు.
డైలాగ్స్కు ప్రాధాన్యం..
- ఈ సినిమాకు రమేశ్ రెడ్డి, శ్రీకాంత్ డైలాగ్స్ రాశారు. డైలాగ్స్తో కలిసే నేను స్టోరీ విన్నాను. సెకండాఫ్లో ఓ ఫేజ్ వచ్చి నప్పుడు పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి. టీజర్లో, ట్రైలర్లో డైలాగ్స్ పవర్ ఏంటో తెలుస్తుంది. అలాంటి డైలాగ్స్ చాలానే ఉన్నాయి. అలాంటి డైలాగ్స్ ఉన్న సీన్స్ చేయాలని చాలా రోజులుగా కోరిక ఉండేది. అవకాశం వచ్చింది. బాగా ఎంజాయ్ చేసి చేశాను.
సంపత్ నందితో సినిమా...
- సంపత్గారితో సినిమా ఎప్పుడైనా చేయడానికి నేను సిద్ధమే. ఇప్పుడు కథా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే వివరాలను తెలియజేస్తాను.
తదుపరి చిత్రం...
- బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్గారి నిర్మాణంలో కుమార్ అనే డైరెక్టర్తో సినిమా చేస్తున్నాను. క్లీన్ లవ్స్టోరీ.