17 March 2018
Hyderabad
నందమూరి కల్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం 'ఎం.ఎల్.ఎ' (మంచి లక్షణాలున్న అబ్బాయి). టి.జి.విశ్వప్రసాద్ సమర్పణలో కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉపేంద్ర మాధవ్ దర్శకుడు. ఈ సినిమా మార్చి 23న విడుదలవుతుంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు కల్యాణ్ రామ్ ఇంటర్వ్యూ...
పోలింగ్కు రెడీ అయ్యారుగా?
- (నవ్వుతూ) అవునండీ... ఈ నెల 23న పోలింగ్ ఉంటుంది. అదే రోజునే రిజల్ట్ కూడా వచ్చేస్తుంది
సినిమాలో మీ కేరక్టర్ ఎలా ఉండబోతోంది?
- సినిమా లవ్స్టోరీతో స్టార్ట్ అవుతుంది. సెకండాఫ్లో రాజకీయాల గురించి ప్రస్తావన ఉంటుంది.. కానీ కేవలం రాజకీయాలకు సంబంధించి డైలాగ్స్ ఉంటాయి కానీ.. పొలిటికల్ డ్రామా సినిమాలో ఉండదు. ఈ సినిమాలో ఇవి మంచి లక్షణాలు అని పర్టికులర్గా ఏ డెఫినిషన్ ఇవ్వలేదు. హీరో సినిమాలో ఓ మంచి పని చేస్తాడు. కొన్ని రోజుల తర్వాత తను చేసింది తప్పు అని తెలుస్తుంది. దాంతోఆ తప్పును ఎలా సరిదిద్దుకున్నాడనేదే కథ. గ్రామంలోని ఓ సమస్యపై హీరో ఎలా పోరాటం చేశాడు. ప్రజలను ఎలా మోటివేట్ చేశాడనేదే సినిమా.
సినిమాలో ప్రేక్షకులు మీ నుండి కొత్తగా ఏం ఆశించవవచ్చు?
- డైైరెక్టర్ ఉపేంద్రమాధవ్ బేసిక్గా రచయిత కావడం వల్ల మంచి డైలాగ్స్ను రాసుకున్నాడు. అలాగే డైలాగ్ డెలివరీ కూడా కొత్తగా ఉండేలా ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు. డైలాగ్స్ ఉచ్ఛారణలో డైరెక్టర్ ఉపేంద్ర మాధవ్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. కాబట్టి ఓ రిథమ్లో, కొత్తగా డైలాగ్ డెలివరీ ఉంటుంది. రజనీకాంత్ స్టయిల్లో డైలాగ్ చెప్పించే ప్రయత్నం చేయించాడు. అలాగే సినిమాలో ఉండాల్సిన కమర్షియల్ హంగులన్నీ ఉంటాయి.
'పటాస్' సక్సెస్ తర్వాత ఆ జోరును ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు?
- 'పటాస్' కంటే ముందుగానే 'షేర్' సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. అయితే ముందుగా విడుదలైన 'పటాస్' సినిమా కమర్షియల్గా మంచి సక్సెస్ను ఇవ్వడమే కాదు.. హీరోగా నాకున్న గుర్తింపు మరింత పెంచింది. తర్వాత వచ్చిన 'షేర్' సక్సెస్ కాలేదు. పూరి జగన్నాథ్గారి దర్శకత్వంలో చేసిన 'ఇజం' కమర్షియల్గా సక్సెస్ సాధించకున్నా.. నటుడిగా ఎంతో సంతృప్తినిచ్చింది. నటుడిగా ఓపెన్ అయ్యానని అనుకుంటున్నాను.ఈ నెల 23న రానున్న 'ఎం.ఎల్.ఎ' విషయానికి వస్తే.. పూర్తి కమర్షియల్ అంశాలతో నిండి ఉంటుంది. తర్వాత జయేంద్ర దర్శకత్వంలో చేస్తున్న 'నా నువ్వే' .. లవ్ స్టోరీ. ఈ కథ వినగానే 'సార్..ఈ కథకు నేనెలా ఫిట్ అవుతానని అనుకున్నారు?' అని అన్నాను. కానీ ఆయన నువ్వు కొత్తగా కనపడతావని నమ్మకంగా చెప్పారు. దాంతో సినిమా చేయడానికి అంగీకరించాను. ఓ హీరోగా నేను మంచి సినిమాలు చేశానా? లేదా? అనే చూసుకుంటాను. అంతే కానీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని రాబట్టుకుందనే దాని గురించి పెద్దగా ఆలోచించను. నటుడిగా కొత్త సినిమాలు చేయాలనేదే నా ప్రయత్నం. ఈ ప్రయత్నంలో ఎప్పటికైనా సక్సెస్ సాధిస్తాననే నమ్మకం ఉంది.
కథలను ఎలా సెలక్ట్ చేసుకుంటారు?
- ఎవరైనా కథ చెబితే..ఆ కథకు, నేను చేసిన ముందు చిత్రాలకు ఏదైనా పోలిక ఉందా? నా క్యారెక్టర్ ఎలా ఉంది? కొత్తదనం ఉందా? లేదా? అని ఆలోచిస్తాను.
సాయిధరమ్తేజ్తో మల్టీస్టారర్ చేయాల్సింది కదా?
- సాయిధరమ్ తేజ్తో మల్టీస్టారర్ చేయాల్సింది కానీ.. మా ఇద్దరికీ కథ నచ్చకపోవడంతో కుదరలేదు. మంచి కథ కుదిరితే ఎవరితోనైనా సినిమా చేయడానికి రెడీ. ఇప్పుడు ఓ మల్టీస్టారర్ కథ సిద్ధమవుతోంది. ఈ ఏడాది జూన్ లేదా జూలైలో మల్టీస్టారర్ను అనౌన్స్ చేయబోతున్నాను. అప్పుడే పూర్తి వివరాలు తెలియజేస్తాం.
నిర్మాతగా మీ ప్రయాణం ఎలా ఉంది?
- నిర్మాతగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా బ్యానర్లో వస్తున్న సినిమాలను చూసి ప్రేక్షకులు 'ఏదో కొత్తగా ట్రై చేశాడులే..' అని అనుకుంటారు కానీ.. 'చెత్త సినిమా చేశాడురా' అని అనుకోలేదు. నేను హీరోగా చేసే సినిమాల విషయంలో కూడా నిర్మాతగా వేస్టేజ్ చేయాలనుకోను. త్వరగా, తక్కువగా.. మంచి అవుట్పుట్తో ఎక్కడ పూర్తి అవుతుందనుకుంటే దానికి సిద్ధపడిపోతాను.
తారక్తో మీ అనుబంధం ఎలా ఉంటుంది?
- నాకు, తారక్కు మధ్య మా సినిమాలకు సంబంధించిన చర్చలే ఎక్కువగా జరుగుతుంటాయి. చిన్నప్పట్నుండి ఇద్దరి మధ్య ఈ అనుబంధం ఉంది. బయట విషయాలు కూడా మాట్లాడుకుంటాం కానీ చాలా తక్కువగానే. తను సినిమాలో ఎలా చేశాడోనని నేను చెబితే.. నా సినిమాలను చూసి తన అభిప్రాయాలను చెబుతుంటాడు తారక్. 'ఎం.ఎల్.ఎ' సినిమా ట్రైలర్ చూసిన తర్వాత 'అన్నయ్య.. ఈ సినిమాలో నువ్వు కొత్తగా కనపడుతున్నావ్..నిన్ను డైరెక్టర్ చక్కగా ప్రెజంట్ చేశాడు' అని అన్నాడు.
ఎన్టీఆర్ బయోపిక్లో నటించమని అడిగారా?
- లేదండీ...'యన్టీఆర్' బయోపిక్లో నన్ను నటించమని ఎవరూ అడగలేదు. మా కుటుంబ సభ్యుల మధ్య ఆ చర్చ కూడా రాలేదు. వస్తే తప్పకుండా వివరాలు చెబుతాను.
రాజకీయాల గురించి ఆలోచిస్తున్నారా?
- ప్రస్తుతం అలాంటి ఆలోచనలు అస్సలు లేవు. ప్రస్తుతం సినిమాల గురించే ఆలోచిస్తున్నాను. మా మైండ్సెట్ ప్రకారం నేను రెండు పడవలపై ప్రయాణించలేను. ప్రస్తుతం హీరోగా నా కెరీర్ పట్ల హ్యాపీగా ఉన్నాను.