|
31 July 2018
Hyderabad
సుమంత్ అశ్విన్, నిహారిక కొణిదెల జంటగా లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'హ్యాపి వెడ్డింగ్'. యువి క్రియేషన్స్, పాకెట్ సినిమా సంయుక్తంగా నిర్మించారు. ఈ నెల 28న సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా దర్శకుడు లక్ష్మణ్ కార్య మాట్లాడుతూ ```హ్యాపి వెడ్డింగ్`కు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. నేను ఫ్యామిలీ, మహిళా ప్రేక్షకులను టార్గెట్ చేశాను. వారి నుండి నాకు మంచి రెస్పాన్స్ రావడం హ్యాపీగా ఉంది. మాది తిరుపతి. ఓంకార్గారు జీనియస్ షో కోసం ఆడిషన్ చేశారు. నా స్నేహితుడు శ్రీహరి ఆ షోకు ఎంపికయ్యాడు. అప్పుడు నేను కూడా తనతో పాటు హైదరాబాద్ వచ్చేశాను. నేను చేసిన షార్ట్ ఫిలింస్ చూసి నన్ను కూడా ఎంపిక చేసుకున్నారు. అలా ఓంకార్గారి జీనియస్ షోకు నేను వర్క్ చేశాను. తర్వాత 'మొగుడు' సినిమాకు కెమెరా డిపార్ట్మెంట్లో పనిచేశాను. తర్వాత దేవాకట్టాగారి దగ్గర 'ఆటోనగర్ సూర్య' సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. హ్యాపివెడ్డింగ్ కంటే ముందు ఎందుకిలా అనే వెబ్ సిరీస్ చేశాను. ఆ సమయంలో సుమంత్ అశ్విన్గారితో మంచి పరిచయం ఏర్పడింది. ఆయనకు సినిమా నచ్చడంతో ప్రాజెక్ట్ అలా సెట్ అయింది. హీరోయిన్గా తెలుగు అమ్మాయి అయితేనే బావుంటుందనుకున్నాం. ముందు ఇద్దరు, ముగ్గురు పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. ఆ సమయంలో నా భార్య నిహారికగారైతే ఈ పాత్రకు సరిపోతారని సలహా ఇచ్చింది. తను ఒప్పుకుంటుందో లేదో అని టెన్షన్తోనే ఆమె దగ్గరకు వెళ్లి నెరేషన్ ఇచ్చాను. తొలి నెరేషన్లోనే ఆమె సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారు. సినిమా విడులైన తర్వాత నాగబాబుగారు ఫోన్ చేసి అప్రిషియేట్ చేయడంతో సంతోషమేసింది. నా తదుపరి చిత్రానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. అంతా ఓకే అయితే.. వివరాలు తెలియజేస్తాను'' అన్నారు.
|
|
|
|
|
|