8 November 2017
Hyderabad
మంచు మనోజ్ ఇప్పుడు చాలా జోరుమీద ఉన్నారు. `ఒక్కడు మిగిలాడు` సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేశారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. అణచివేత పెరిగేకొద్దీ తిరుగుబాటూ, తీవ్రవాదం పెరుగుతాయని అంటున్నా మంచు మనోజ్ మనసులోని మరిన్ని మాటలు...
* `ఒక్కడు మిగిలాడు` సినిమా గురించి చెప్పండి?
- చాలా మంచి సినిమా. హార్ట్ టచింగ్ అటెంప్ట్. 2017లో సూర్యగానూ, 1990కి ముందు పీటర్గానూ రెండు పాత్రల్లో కనిపిస్తా. ఎక్కడా నవ్వులు, పాటలు ఉండవు. మనసుకు తాకే సినిమా అవుతుంది.
* ఈ కథను ఎలా యాక్సెప్ట్ చేశారు?
- గోపీమోహన్గారి ద్వారా అజయ్ ఈ కథను నాకు చెప్పాడు. ఒక వర్గానికి దేవుడైన వ్యక్తి కథ ఇది. దర్శకుడు రాసుకున్న నోట్స్, ఆయన చేసిన రీసెర్చి నన్ను మెప్పించాయి. ఇందులో నేను, పోసానిగారు, సుహాసినిగారు వంటి కొంతమంది తప్పితే మిగిలిన వారందరూ కొత్తవారు. చాలా మంచి పెర్ఫార్మర్లు.
* హైలైట్స్ ఏం ఉంటాయి?
- తొలి సగంలో వార్ సీక్వెన్స్ ఉంటుంది. అక్కడే కొన్ని ఆసక్తికరమైన అంశాలుంటాయి. సెకండాఫ్ లో 40 నిమిషాల పాటు నేను కనిపించను. అక్కడ బోట్ సీక్వెన్స్ ఉంటుంది. చాలా థ్రిల్లింగ్గా, మనసును బరువెక్కించే సన్నివేశాలు చాలానే ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే హై ఇంటెన్స్, కమర్షియల్ సినిమా ఇది.
* ఈ మధ్య కొంతమందికి సినిమా చూపించారట కదా?
- నాన్నగారు ఇంకా చూడలేదు. అక్కతో పాటు కొందరు సన్నిహితులు చూశారు. ఊపిరి తీసుకోలేకపోయాం.. అంత బరువుగా ఉంది అని కితాబిచ్చారు.
* ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డట్టున్నారు?
- అంత తేలిగ్గా అడుగుతున్నారు.. (నవ్వుతూ).. చాలా కష్టపడ్డాను. పడుకుంటే ప్రతిరోజూ కలలో యుద్ధాలే కనిపిస్తున్నాయి. అదేంటో ప్రతి యుద్ధంలోనూ ఫ్యామిలీని కాపాడుకుంటూనే ఉన్నట్టు అనిపిస్తోంది.\
* బరువు తగ్గరా?
- పెరిగాను. ఈ సినిమాలో రెండు పాత్రల మధ్య వైవిధ్యాన్ని చూపించడం కోసం చాలా బరువు పెరిగాను . పీటర్ పాత్ర చేస్తున్నంత సేపు నరాలన్నీ బిగబట్టి ఉండాల్సి వచ్చేది. ప్రతి రోజూ సెట్కి తెల్లారుజామున 4.30కి వెళ్లేవాళ్లం. ఎవరికీ మేకప్లు ఉండవు. కొన్ని సార్లు వార్ సీక్వెన్స్ లు చేసేటప్పుడు మాత్రం వాటికి అనుగుణంగా మేకప్లు వేసుకునేవాళ్లం. వచ్చే లైట్కి అనుగుణంగా సన్నివేశాలను తెరకెక్కించుకున్నామే తప్ప, ఏదీ కావాలని ఒకదానితర్వాతే ఒకటి అనుకుని చేయలేదు. మా దర్శకుడికి ఎక్కడ ఎలా చేయాలో చాలా బాగా క్లారిటీ ఉంది. అందుకే ఈ సినిమాకు హీరో అతనే. నేను సపోర్టింగ్ ఆర్టిస్ట్ ని అని చెబుతాను.
* మీరు చెన్నైలో పెరగడం వల్ల ఈ కథకి బాగా కనెక్ట్ అయ్యారా?
- చెన్నై అని కాదు. ఇప్పుడు ఎవరో ఒకటి, రెండు చోట్ల బాంబులు వేస్తే మనం కూర్చుని ఇలా మాట్లాడం. ఎందుకంటే అప్పుడు మనకు కులాలు, పెద్దాచిన్నా అనేవి ఏవీ గుర్తు రావు. అలాంటిది ఓ సమాజం బాగుకోసం పోరాడిన వ్యక్తి జీవితానికి స్ఫూర్తి పొందని వాళ్లు అరుదుగా ఉంటారేమో. నాకు తెలిసిన చాలా మంది ఇళ్లల్లో పూజగదుల్లో ఉన్న పెద్దాయన కథ ఇది.
* సెన్సార్ ఇబ్బందులు తలెత్తాయా?
- చుక్కల్ని చూపించారు. చాలా చుక్కల్ని లెక్కబెట్టాను. అంటే మా సినిమా అంత రాగా ఉంటుంది మరి. అప్పటికీ జరిగిన విషయాలే అయినా వాటి తీవ్రతను మేం 1 శాతం కూడా చూపించలేదు అనేది వాస్తవం.
* తర్వాతి సినిమా ఎప్పుడు?
- నేను ప్రస్తుతం మెంటల్గా, ఫిజికల్గా ఈ సినిమా నుంచి బయటపడాలి. ఒక ఆరు నెలలు గ్యాప్ తీసుకుంటా. అప్పుడు ఓ లవ్స్టోరీ చేస్తాను. నేను మీకు తెలుసా దర్శకుడు అజయ్ శాస్త్రి, తన ఫ్రెండ్ శ్రవణ్తో కలిసి ఓ మంచి కథ తెచ్చారు. చంద్ర అని కొత్త దర్శకుడు దర్శకత్వం చేస్తారు. మిగిలిన పనులన్నీ పూర్తి కాగానే చెబుతాను.
* మొన్న ఆడియో వేడుకలో చాలా ఆవేశంతో మాట్లాడారు?
- ఆవేశమా? కొన్ని సార్లు తప్పదు. అలాగే అనిపిస్తుంది. మా సినిమాను నైజాంలో కొత్త డిస్ట్రిబ్యూటర్లు కొన్నారు. వాళ్లు థియేటర్లను తీసుకురావాలంటే ఓ పెద్ద ప్రొడ్యూసర్ దగ్గరకే వెళ్లాలి. డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థమీద నాకు కోపం వచ్చింది. ఇప్పటిదాకా సినిమా పరిశ్రమలో అందరం సోదరుల్లాగా ఉంటున్నాం. చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఓ నిర్మాత మరో నిర్మాతను చంపేస్తే.. ఆ మాట వినడానికి ఎంత అసహ్యంగా ఉంటుంది. అందుకే మన సినిమా పెద్దలందరూ కలిసి డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి కూడా సరైన ప్రణాళికలు రూపొందిస్తే బావుంటుంది అనేది నా అభిప్రాయం. మా సినిమాలోనూ అణచివేతకు గురయినవారు తిరుగుబాటు చేస్తారు. తీవ్రవాదులుగా తయారవుతారు అని చెప్పాం. సినిమా పరిశ్రమలో ప్రస్తుతం తిరుగుబాటు దగ్గరే ఆగి ఉన్నాం.
* సినిమాల నుంచి వెళ్లిపోతానని ఆ మధ్య ట్వీట్ చేసినట్టున్నారు?
- నాకు జనాల్లోకి రావాలని ఉందండీ. జనాల మధ్య ఉండి వారికి కావాల్సినవన్నీ చూడాలని ఉంది.
* రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నారా?
- రాజకీయాలంటే అలాగని కాదు.. ఏదో పక్కనుండి చేయాలనిపిస్తోంది. ఆ మాటే ఇంట్లో వారితో అంటే విష్ణు అన్న వెనక తన్ని మర్యాదగా ప్రస్తుతం సినిమాలు చేయమని అన్నారు. వెంటనే సినిమాలుచేస్తున్నా
* ప్రస్తుతం రాజకీయాల మీద మీ కామెంట్ ఏంటి?
- మనకు బాగానే ఉందండీ. హైదరాబాద్, విజయవాడ చాలా బాగా డెవలప్ అవుతున్నాయి. కానీ పాపం తమిళనాడు వాళ్లకే ఓ మంచి లీడర్ కావాలి. కమల్హాసన్ ముఖ్యమంత్రి అయితే చూడాలని ఉంది.