మెగాస్టార్ చిరంజీవి నట వారసులుగా హీరోలు తెలుగు తెరకు పరిచయం అయ్యారు. అయితే తొలిసారి మెగా వారసురాలిగా, మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె కొణిదెల నిహారిక 'ఒక మనసు' చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. నాగశౌర్య, నిహారిక జంటగా టీవీ 9 సమర్పణలో మధుర ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రామరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఒక మనసు'. జూన్ 24న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు రామరాజుతో ఇంటర్వ్యూ....
మంచి లవ్స్టోరీ చేయాలనిపించింది...
- చాలా మంది ప్రస్తుతం ఉన్న తెలుగు సినిమా ట్రెండ్కు వ్యతిరేకంగా ఓ ప్యూర్ లవ్స్టోరీ చేయడానికి కారణమేంటని అడుగుతున్నారు. కానీ సినిమా కథ రాసుకునేటప్పుడు, సినిమా చేసేటప్పుడు అలా ఆలోచించలేదు. ఒక మంచి లవ్స్టోరీ చేయాలనిపించడంతో ఒక మనసు సినిమా చేయడానికి రెడీ అయ్యాను.
ప్రేమకథలే గుర్తుంటాయి....
- నాకు సినిమా అనేది నా డ్రీమ్. సినిమా అనగానే నాకు వెంటనే గుర్తుకు వచ్చేది మరోచరిత్ర. ఎప్పుడైనా అందరికీ ప్రేమకథాచిత్రాలే ఎక్కువగా గుర్తుంటాయి. అలాంటి ఓ మంచి ప్రేమకథ తీయాలనిపించడంతో ఒక మనసు సినిమా చేశాను.
నిహారికను ఎంపిక చేసుకోవడానికి....
- కథను రాసుకున్న తర్వాత నిర్మాతలు కమర్షియల్గా బిగ్ వేలో వెళదామని అన్నారు. సంధ్య అనే అమ్మాయి పాత్ర చాలా గొప్పగా ఉంటుంది. అందుకని ఈ కథను సమంతకు ముందు వినిపించాం. ఆమె చేయడానికి రెడీ అయ్యారు కానీ జూన్ వరకు ఆగాలన్నారు. దాంతో వేరే హీరోయిన్తో వెళదామనిపించింది. రెజీనా సహా మరికొంత మందికి ఈ కథను వినిపించాను. అందరూ ఓకే అన్నారు కానీ డేట్స్ ప్రాబ్లెం వచ్చింది. దాంతో కొత్త హీరోయిన్తో వెళదామని, హీరోయిన్ కోసం అన్వేషణ ప్రారంభించాం. ఓరోజు మధురశ్రీధర్గారు ఫోన్ చేసి నిహారిక అయితే ఎలా ఉంటుందని అడిగారు. తను టీవీప్రోగ్రాంస్ చేస్తుందని తెలుసు కానీ నేను టీవీ సరిగా చూడను.శ్రీధర్గారు చెప్పిన తర్వాత టీవీ చూశాను. అలా చూస్తున్నప్పుడు తనలో నేను రాసుకున్న కథలో సంధ్య పాత్రలోని అమాయకత్వం కనపడింది. దాంతో నేను శ్రీధర్గారితో నిహారికతో సినిమా చేద్దామని చెప్పాను.
మూడు అంశాలు గురించి...
- నా సినిమాల్లో మల్లెపువ్వు, కాటన్ చీర, సముద్రతీరం అనే మూడు అంశాలు కామన్గా కనపడతాయి. మల్లెపువ్వు అంటే రొమాన్స్. అందరికీ కనెక్ట్ అవుతుంది. అలాగే ఎవరైనా చీరలో చూపిస్తే గ్రేస్ వేరుగా ఉంటుంది. అందుకనే కాటన్ చీర నా సినిమాలో ఉంటుంది. నా కథలకు ప్రకృతే బ్యాక్డ్రాప్ కాబట్టి సముద్రతీరం నా సినిమాలో కనపడుతుంది.
ఒక్కో సినిమా ఒక్కొక్కలా....
- సాధారణంగా ఒక్కొక్క సినిమా ఒక్కో తరహాలో ఉంటుంది. బాజీరావ్ మస్తానీ ఓ స్టయిల్లో, మరో సినిమా మరో స్టయిల్లో ఉంటుంది. చక చకా సీన్స్ వేసుకుంటూ వెళ్లిపొతే ఫీల్ మిస్ అవుతాం. ఒక మనసు సినిమా విషయానికొస్తే కథను ఎక్కడా ఫ్లో దెబ్బతినకుండా నేరేట్ చేశాను.
సంధ్యలా మరిపోయింది....
- శ్రీధర్గారు ఫోన్ చేసి కథ నెరేట్ చేయాలని చెప్పగానే నాకెందుకో భయమెస్తుంది సార్ అనే మాట అయితే చెప్పాను. ఎందుకంటే తను మెగాఫ్యామిలీకి చెందిన హీరోయిన్. చిరంజీవిగారికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో తెలుసు. ప్రతి అభిమాని సినిమా ఎలా ఉంటుందోనని ఆసక్తిగా గమనిస్తాడు. అందుకని కథను నిహారికకు ఆమె తల్లిదండ్రుల సమక్షంలోనే చెప్తానని చెప్పాను. అలాగే ప్రతి సీన్ను వారితో పాటు నిహారికకు వివరించాను. సీన్లో ఎక్కడ ఫిజికల్ టచ్ వస్తుందో, దాని పరిమితులేంటో చెప్పాను. నేను నెరేట్ చేసిన తర్వాత నిహారిక నటించడానికి ఒప్పుకుంది. ఓ రకంగా చెప్పాలంటే నిహారిక సంధ్య పాత్రలో ఒదిగిపోయింది. సెట్స్లో కూడా సంధ్య అనే పిలవమనేది. తనెక్కడా నిహారికగా కనపడలేదు.
సంద్య పాత్ర గురించి...
- ఇప్పుడైనా, ఎప్పుడైనా ప్రేమ, బంధం ఒకటే. అందుకనే మనమింకా మనుషులుగానే ఉన్నాం. ఒక మనుసు అనేది మనలో, మన చుట్టూ ఉండే పాత్రలను చూస్తూ రాసుకున్న ఓ యదార్థం.
పాత్రల ప్రాముఖ్యత...
- మరోచరిత్ర సినిమా చూసిన తర్వాత ప్రేక్షకుడికి బాలు, స్వప్న పాత్రలే గుర్తుండిపోతాయి. అందులో ఎవరి పాత్ర గొప్పదంటే ఎలా చెప్పగలం. అలాగే ఈ చిత్రంలో కూడా సూర్య పాత్ర గొప్పదా, సంధ్య పాత్ర గొప్పదా అని చెప్పలేం. రేపు సినిమా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది.
సూర్యగా శౌర్య...
- కథ వినగానే నాగశౌర్య సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. సూర్య అనే పాత్రలో ఇన్వాల్వ్ అయ్యాడు. ఇలాంటి పాత్రను గొప్పగా చేశాడు.
సినిమాలు మానేద్దామనుకున్నాను...
- ప్రతి సినిమాను పురిటినొప్పులు భరించిన తర్వాత వచ్చే బిడ్డలాంటిది. అయితే మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు చిత్రం మిస్ క్యారీ అయ్యింది. దాంతో సినిమాలు మానేద్దామనుకున్నాను. ఒక సంవత్సరం పాటు గ్యాప్ తీసుకున్నాను. అయితే చంద్రమౌళి వంటివారు నాకు అండగా నిలబడి సినిమాలు చేయమని ప్రోత్సహించారు. సినిమా అనేది బిజినెస్ అని కూడా భావించి ఆలోచించుకుని ఒక మనసు సినిమా చేశాను.
తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ ఆదరిస్తారు...
- స్వచ్చమైన ప్రేమకథలు వచ్చి చాలా కాలమైంది. రెగ్యులర్ సినిమాలను చేస్తే నేనెందకనిపించే ఒక మనసు వంటి ప్యూర్ లవ్ స్టోరీ చేశాను. అయితే ఇప్పుడున్న ట్రెండ్లో తెలుగు ప్రేక్షకులు ఇలాంటి సినిమాలు చూస్తారా అనుకోవచ్చు కానీ మనం చేసే ప్రయత్నాన్ని నిజాయితీతో చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు. తెలుగు ప్రేక్షకులు భారతీరాజా, బాలచందర్, బాలు మహేంద్ర వంటి దర్శకులు చేసిన చిత్రాలను ఆదరించారు. శంకరాభరణం వంటి చిత్రాన్ని కూడా తెలుగు ప్రేక్షకులే ఆదరించారు. తెలుగు ప్రేక్షకులు విలక్షణ చిత్రాలను ఆదరించకపోతే తమిళ చిత్రాలకు ఇంత పెద్ద మార్కెట్ ఉండదు.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్...
- ఇదే ప్రొడక్షన్లో మరో చిత్రం చేయబోతున్నాను.