ఆర్పీ పట్నాయక్ నటిస్తూ, సంగీతం అందిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం `మనలో ఒకడు`. యూనిక్రాఫ్ట్ మూవీ పతాకంపై జగన్ మోహన్ నిర్మిస్తున్నారు. 'నువ్వు నేను' ఫేం అనితా హెచ్. రెడ్డి కథానాయికగా నటించారు. ఈ సినిమాను నవంబర్ 4న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో సాయికుమార్ కీలక పాత్రను పోషించారు. బుధవారం హైదరాబాద్లో జరిగిన ప్రెస్మీట్లో
సాయికుమార్ మాట్లాడుతూ ``నేను ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్ర చేశాను. మీడియా పర్సన్గా నటించాను. నటుడిగా ఒక స్థాయికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి ఆశిస్తారు. అందుకే నేను చేసిన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక విషయాన్ని చొప్పించడానికి ప్రయత్నిస్తాను. నెగెటివ్ పాత్రను చేసినప్పటికీ ఆ పాత్రను కూడా ఒక దుర్యోధనుడిగా, ఒక రావణాసురుడిగా భావించి చేస్తాను. విలన్ పాత్రలో ఒక పొజిషన్లో నేను మాట్లాడుతున్నప్పుడు `చస్తే వీడి చేతిలో చావాలి. చంపితే వీడిలాంటి వాడిని చంపాలి` అని అవతలివారు అనుకునేలా చేస్తాను. సినిమాను మంచి సినిమాగా చేయాలి.. ఫైనల్గా దాని ప్రభావం ఎంత ఉంటుందో నాకు తెలుసు. నటుడిగా ఒక స్థాయికి వచ్చిన తర్వాత తప్పకుండా ప్రేక్షకులు చాలా ఎదురుచూస్తుంటారు. అలా వారి ఎదురుచూపులకు తగ్గట్టు ఉండే సినిమా `మనలో ఒకడు`. పట్నాయక్ నాకు మంచి మిత్రుడు. ఆ పేరుతోనే నాకు చాలా కనెక్షన్లు ఉన్నాయి. ఒరిస్సా కనెక్షన్ కూడా ఉంది నాకు. బరంపురంలో మా ఆవిడ పుట్టింది. నా ఒడుగు బరంపురంలో జరిగింది. నా చెల్లిని బరంపురానికి ఇచ్చాం. నాన్నగారి జీవితంలో ఛిట్ఫండ్ కంపెనీ బరంపురంలో మొదలైంది. ఇలా బరంపురంతో నాకు చాలా కనెక్షన్లున్నాయి. పట్నాయక్ చాలా ప్యాషన్ ఉన్న టెక్నీషియన్. ఈ ప్రాసస్లో కలిసి చేద్దామని చాలా అనుకున్నాం. ఒక సారి కథ వినమని చెప్పారు. కథ వినగానే బోల్డ్ ఫిల్మ్ అని అన్నా. రియాలిటీనే చెబుతున్నామని అన్నారు. అప్పుడు నిర్మాతని గురించి కూడా చెప్పారు.
Sai Kumar interview gallery
నాకు రెండు రకాల పిచ్చి ఉంటుంది. ఒకటి క్రికెట్ చూస్తా. రెండోది ప్రతి ఛానెల్ని చూస్తూ ఉంటా. ఉదయం ఆధ్యాత్మిక కార్యక్రమాల నుంచి రాత్రి మిడ్నైట్ మసాలా వరకు పలు రకాల ఛానెళ్లను చూస్తూనే ఉంటాను. మీడియా ఇవాళ సమాజాన్ని ఎంత ప్రభావితం చేస్తుందో మనకు తెలుసు.అలాంటి నేపథ్యంలో `మనలో ఒకడు` ఎలా ఉంటుందో సినిమాలో చూడాలి. మీడియా కూడా మనలో ఒకడు అన్నట్టే చేశారు. నన్ను చాలా కంట్రోల్ చేసి చేయించుకున్నారు. నన్ను చాలా మంది దర్శకులు కంట్రోల్ చేశారు. కంట్రోల్ చేయని చోట నా నటన ఓవర్ఫ్లో అయినట్టు అనిపించింది. పట్నాయక్ బ్రదర్ గౌతమ్గారు కూడా చాలా సహకరించారు. ఆర్టిస్ట్ ని హర్ట్ చేయకుండా పని చేయించుకోవడమే దర్శకుడి టాలెంట్ అని ఒక సారి రాఘవేంద్రరావుగారు చెప్పారు. అలా నన్ను పట్నాయక్ ఎక్కడా హర్ట్ చేయకుండా చేయించుకున్నారు. శ్రీముఖి చాలా మంచి వేషం వేసింది. ఈ రెండు పాత్రలతో పాటు నాకు పట్నాయక్కి జరిగే సంఘర్షణ సినిమాలో హైలైట్ అవుతుంది. దాన్లోకి నాజర్ ఎలా వచ్చారనేది నాకు కీలకం. డబ్బింగ్ చెబుతున్నప్పుడు కూడా చాలా థ్రిల్ ఫీలయ్యా. చాలా మంచి సినిమా అవుతుంది నాకు. నాజర్ గారు ఈ సినిమాను తమిళ్లో తీస్తానన్నారు. కన్నడలో నేనే చేద్దామనుకున్నా. ఇంటలిజన్స్, ఎమోషన్ అన్నీ ఉన్న పాత్ర ఇది. చాలా ఆసక్తికరంగా సాగే సినిమా. ఫైనల్ గా బ్యూటీఫుల్ మెసేజ్ ఉంటుంది. మీడియాకు కూడా మంచి మెసేజ్ ఉంటుంది. ఏది వార్త, ఏది అతి జరుగుతుందో మీడియాకు కూడా బాగా తెలుసు. జనాలకు దీన్ని ఎంత బాగా చెప్పాలో, అంతే బాగా చెప్పారు పట్నాయక్. నా కెరీర్లో చాలా మంచి వేషాన్ని చేశాను ఈ సినిమాలో. కెమెరామేన్ కూడా చాలా ఇన్వాల్వ్ అయి చేశారు. ఎలా కూర్చోవాలో, ఎలా నిలుచోవాలో కూడా చెప్పారు. అంత బాగా నా పాత్రను ప్రేమించి డిజైన్ చేసుకున్నారు. నన్ను నాలుగో సింహం అగ్ని అని గుర్తుపెట్టుకుంటారు. అయితే ఈ సినిమాతో మూడో కన్ను ప్రతాప్ అని గుర్తుపెట్టుకుంటారు. రియలిస్టిక్ ఇన్సిడెంట్ లను స్ఫూర్తిగా తీసుకుని పట్నాయక్ చేశారు`` అని అన్నారు.