1 May 2019
Hyderabad
సుధాకర్ కోమాకుల హీరోగా, బేబి జాహ్నవి సమర్పణలో యునైటడ్ ఫిలింస్ బ్యానర్పై ఎస్.జె.కె.ప్రొడక్షన్స్ (యు.ఎస్.ఎ) వారి సహకారంతో హరినాథ్ బాబు.బి దర్శకత్వంలో డి.శ్రీకాంత్ నిర్మించిన చిత్రం `నువ్వు తోపురా`. ఈ చిత్రం మే 3న గీతా షిలిమ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా విడుదల కానుంది. ఈ చిత్రం గురించి సుధాకర్ కోమాకుల హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు.
* `నేను తోపు రా`లో మీ పాత్ర గురించి చెప్పండి?
- సరూర్ నగర్ సూరిగా ఇందులో కనిపిస్తాను. తెలంగాణ మాండలికం మాట్లాడుతాను. సరూర్ నగర్ నుంచి అమెరికా వెళ్లిన సూరి అక్కడ సిట్చువేషన్స్ కి తగ్గట్టు ఎలా మారాడు? అనేదే కథ. అతనికి తల్లి ఉంటుంది. ఆమెతో అప్పటిదాకా మాట్లాడడు. ఏవో చిన్న పొరపొచ్చాలుంటాయి. అయితే అమెరికాకు వెళ్లాక అతనికి తల్లి విలువ తెలిసొస్తుంది. అప్పుడు ఆమెతో మాట్లాడుతాడు. అక్కడి నుంచి తల్లి సలహాలు తీసుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది అనేది కథ. నెససిటీ ఈజ్ ద మదర్ అని మేం ట్యాగ్ లైన్ కూడా పెట్టాం. అందులోనూ ఎన్.టి.ఆర్. అనే అక్షరాలున్నాయి.
* టైటిల్ కావాలనే పెట్టారా?
- కాదు. ముందు మా దర్శకుడు `తోపు` అని అనుకున్నారు. ఆ తర్వాత `నువ్వు నాకు నచ్చావు`, `నువ్వే కావాలి` వంటి సినిమాలు హిట్ అయ్యాయి కదా, వాటిలాగా `నువ్వు` చేర్చాలనుకున్నాం. ఆ తర్వాత `ప్రేమించుకుందాం రా`, `పెళ్లి చేసుకుందాం రా` వంటి సినిమాలు గుర్తుకొచ్చాయి. అలా `రా` కూడా కలిపాం. మంచి టైటిల్ తయారయింది.
* మీ దర్శకుడు ఎలా పరిచయం?
- ఆయనతో నాకు కొంత కాలంగా పరిచయం ఉంది. ఇంతకు ముందు రెండు, మూడు కథలనుకున్నాం. మహంకాళి అని ఈ సినిమా రైటర్ ఈ కథ చెప్పారు. ఇందులో తెలంగాణ యాస కూడా కలిపారు. చాలా చక్కగా ప్రెజెంట్ చేశారు డైరక్టర్.
* తెలంగాణ యాస బాగా వచ్చేసినట్టుంది?
- ఇటీవల కేసీఆర్ వాళ్ల ఊరుకు వెళ్లా. ఆయన మాట్లాడినట్టు మాట్లాడటం కూడా వచ్చేసింది.
* ఫారిన్లో ఎక్కువ షూటింగ్ చేసినట్టున్నారు కదా?
- అవునండీ. దాదాపు 55, 60 రోజులు అక్కడ చిత్రీకరించాం. మా సహ నిర్మాత డా.జేమ్స్ వాట్ కొమ్ము(యు.ఎస్.ఎ) విదేశాల్లో ఉంటారు. ఆయన ఈ కథ నచ్చి మాతో అసోసియేట్ అయ్యారు. ఆయన సూచన ప్రకారమే సాల్ట్ లేక్ సిటీ, ప్రొవో, తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. ఒక రకంగా చెప్పాలంటే చాలా యూనిక్ ప్లేసెస్ అవి. అంత తేలిగ్గా పర్మిషన్లు కూడా దొరకవు. ప్రపంచంలో ఫాస్టెస్ట్ వెహికల్స్ ని చెక్ చేయాలన్నా అక్కడి రోడ్ల మీదనే చేస్తారు. అంత సూపర్బ్ లొకేషన్లు అవి.
* అక్కడివారు కూడా పనిచేసినట్టున్నారు?
- లోకల్ టాలెంట్ను కూడా ఎంకరేజ్ చేశాం. న్యూయార్క్ లో వాళ్ల చేతే డబ్బింగ్ కూడా చెప్పించాం. సాంకేతిక నిపుణుల్లోనూ విదేశీయులున్నారు.
* హీరోయిన్ గురించి చెప్పండి?
- నిత్యా శెట్టి మా చిత్రంలో నాయిక. ఆమె ఇప్పటికే నంది అవార్డులు కూడా తీసుకున్నారు. మా సినిమాలో పెక్యూలియర్గా కనిపించాలి. పైగా వర్క్ షాప్లు కూడా ఉన్నాయి. కాబట్టి కాస్త తీరుబడిగా ఉండే నాయిక కావాలనుకున్నాం. ఆమె పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారు. చాలా బాగా చేశారు. ఈ సినిమాలో దువ్వాసి మోహన్, ఫిష్ వెంకట్, జబర్దస్త్ రాకేష్, మహేష్ విట్టా ఇలా చాలా మంది ఉన్నారు.
* `లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్`తో వచ్చిన క్రేజ్ని క్యాష్ చేసుకోలేకపోయామని అనుకుంటున్నారా?
- అలాంటిదేమీ లేదండీ. కాకపోతే శేఖర్కమ్ములగారి సినిమా స్కూలు. ఈ సినిమా వర్క్ షాప్లాంటిది. లైఫ్ ఈజ్ తర్వాత రెండు సినిమాలు చేశా. ఎక్కడో మిస్ ఫైర్ అయ్యాయి. కానీ ఇకపై అలా జరగవు. చాలా జాగ్రత్తగా మనస్ఫూర్తిగా నమ్మిందే చేస్తా.
* ఇటీవల యాక్సిడెంట్ నుంచి రెకవర్ అవుతున్నారా?
- అవుతున్నానండీ. కాకపోతే ఇంకా మహిళ చనిపోయారన్న విషయమే బాధ కలిగిస్తోంది. మా యూనిట్ తరఫున మేం రూ.5 లక్షలను ప్రకటించాం. ఆమెకు 11వ రోజు పూర్తయ్యాక తీసుకెళ్లి ఇస్తాం. మరికొందరు గాయపడ్డారు. మా డ్రైవర్ కూడా కోలుకుంటున్నారు. ఇలాంటి పదే పదే జరగకుండా రోడ్డు భద్రత మీద అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నాం.