`దొంగాట` సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు వంశీకృష్ణ. ఆ తర్వాత ఆయన చేసిన సినిమా `కిట్టు ఉన్నాడు జాగ్రత్త`. శుక్రవారం విడుదల కానున్న ఈ సినిమా గురించి వంశీకృష్ణ గురువారం హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు.
* మీ గురించి చెప్పండి?
- మా నాన్నగారు గతంలో పలు సినిమాలను నిర్మించారు. నేను పుట్టి పెరిగింది చెన్నైలోనే. ఎస్ఆర్ ఎంలో విజువల్ కమ్యూనికేషన్ చేశాను. దర్శకత్వం వైపు వెళ్లాలని ఉందని నాన్నగారితో చెప్పగానే నన్ను ముందు ఎడిటింగ్ నేర్చుకోమన్నారు. అలా శ్రీకర్ ప్రసాద్గారి దగ్గర చేరాను. తెలుగులో అప్పుడు ఆయన చాలా సినిమాలు చేస్తుండటంతో హైదరాబాద్కు వచ్చాను. ఎడిటింగ్లో యావిడ్ వచ్చిన కొత్త కాబట్టి నాకు ఎడిటింగ్ మీద చాలా ఆసక్తిగా ఉండేది. సరిగా ఆ సమయంలోనే ఘర్షణ షూటింగ్ జరిగింది. తెలుగు, తమిళ్ తెలిసిన యువకుడు డైరక్షన్ డిపార్ట్ మెంట్లో పనిచేయడానికి కావాలని గౌతమ్మీనన్ వెతుకుతున్నట్టు నాకు ఫ్రెండ్ చెప్పాడు. అలా దర్శకత్వశాఖలో చేరాను. దాదాపు ఎనిమిది సినిమాలకు పనిచేశాను. లక్ష్మీగారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అప్పుడే ఆమె `దొంగాట`కు ఛాన్స్ ఇచ్చారు. దర్శకుడికి సినిమా నిర్మించే అనుభవం ఉంటే మరింత యూజ్ ఉంటుందని అనిపించింది. అలా నేను విష్ణు సినిమాలకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా పనిచేశాను. ఇప్పుడు ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్స్ పిలిచి ఈ అవకాశాన్నిచ్చారు.
* కుక్కలను కిడ్నాప్ చేయడం కష్టమేమో కదా?
- లేదండీ చాలా ఈజీగా చేయొచ్చు. పైకి చూడ్డానికి ఇది కుక్కల కిడ్నాప్ అని అనిపిస్తుంది. కానీ దానికి మించింది కూడా ఇందులో ఉంటుంది. స్క్రీన్ప్లే బేస్డ్ సినిమా.
* ఇందులో ప్రధాన అంశాలేమిటి?
- ప్రధానంగా సాగుతుంది. లవ్ ఆద్యంతం ఉంటుంది. హీరో, హీరోయిన్ చాలా బాగా చేశారు. వారితో పాటు మిగిలిన వారి పాత్రలు కూడా మెప్పిస్తాయి.
* ఎన్ని కుక్కలను వాడారు?
- దాదాపు 40 కుక్కలను వాడామండీ. వాటికి మినిమమ్ ట్రయినింగ్ ఇచ్చారు. వాటిని మాకు అనుగుణంగా వాడుకున్నాం. ఆర్టిస్టులు బిజీగా ఉన్నప్పుడు కుక్కలను పెట్టి రకరకాల యాంగిల్స్ తీసుకునేవాడిని. వాటి వల్ల మాకు ఎక్కువ పనిరోజులు కాలేదు.
* తదుపరి సినిమాలకు కథలున్నాయా?
- ఉన్నాయండీ. నెక్స్ట్ స్పై థ్రిల్లర్ చేయాలనుకుంటున్నాను. ఎవరితో అన్నది ఇంకా ఫైనలైజ్ కాలేదు. కాకపోతే నాని, శర్వానంద్, బన్నీతో సినిమా చేయాలని ఉంది.