సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ ఫిర్జాదా జంటగా బివిఎస్ రవి దర్శకత్వం వహిస్తున్నచిత్రం `జవాన్`. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 1న విడుదలవుతుంది.
ఈ సందర్భంగా హీరోయిన్ మెహరీన్ మాట్లాడుతూ ``జవాన్` చిత్రంలో పెయింటర్ భార్గవి అనే పాత్రలో కనపడతాను. నా గత చిత్రాల కంటే గ్లామరస్ పాత్ర. బబ్లీగా ఉంటూ హీరోను డామినేట్ చేసే పాత్ర చేశాను. సాయిధరమ్ తేజ్ ఎప్పుడూ హ్యాపీగా ఉంటాడు. తనతో సెట్స్లో బాగా కలిసిపోయాను. సెట్స్లో ఎంజాయ్ చేస్తూ నటించాం. కృష్ణగాడి వీర ప్రేమగాథ తర్వాత నేను ఒప్పుకున్న సినిమా ఇది. సాయిధరమ్ బేసిక్గా మంచి డ్యాన్సర్. నేనెమో మంచి డ్యాన్సర్ కాను. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాల్లో పెద్దగా డ్యాన్సులు చేయలేదు. జవాన్ సినిమాలో డ్యాన్స్ నెంబర్ ఎక్కువగా ఉన్నాయి. యూరప్లో బంగారు..సాంగ్ను చిత్రీకరించినప్పుడు ఎలాగో మెనేజ్ చేశాను. అయితే సెట్ సాంగ్లో మాత్రం మెనేజ్ చేయడం కుదరదని నాకు తెలుసు. అందుకని డ్యాన్స్ క్లాసులకు వెళ్లాను. బొమ్మ అదిరింది సాంగ్లో బాగా డ్యాన్స్ చేశాను. నా తదుపరి చిత్రాల్లో నా డ్యాన్స్ మూమెంట్స్ ఇంకా బెటర్గా ఉంటాయి. సినిమాలో మెయిన్ స్టోరీ హీరో, విలన్ మధ్య సాగుతుంది. ఈ సినిమా సైన్ చేసేటప్పుడు నాకు పూర్తి కథ కూడా తెలియదు. కానీ బి.వి.ఎస్.రవిగారిపై నమ్మకంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. `కృష్ణగాడి వీరప్రేమగాథ` సినిమా విడుదలైన రెండో రోజునే `జవాన్` సినిమా సైన్ చేశాను. కథ ఎలా ఉందనే దానితోపాటు డైరెక్టర్పై నమ్మకంతో ఓ సినిమా ఒప్పుకుంటాను. ఇప్పటి వరకు నేను ప్రతి సినిమా నాకు మంచి గుర్తింపే తెచ్చిపెట్టింది. ప్రస్తుతం తెలుగు సినిమాలు చేయడానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తాను.బాలీవుడ్కు వెళ్లాలనే ఆలోచనలేం లేదు. నిజం చెప్పాలంటే తెలుగు సినిమాలో చేస్తున్నందుకు గర్వంగా చెబుతాను. అయినా నా దృష్టిలో టాలీవుడ్, బాలీవుడ్ వేరు వేరు కాదు. నాకు సినిమానే ముఖ్యం. ప్రస్తుతం తెలుగు సినిమానే టాప్ లో ఉంది. ప్రస్తుతం తెలుగులో ఒకే ఒక సినిమా చేస్తున్నాను. అది గోపీచంద్గారి సినిమా`` అన్నారు.