10 December 2014
Hyderabad
సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు, మంచి మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ధనుష్ హీరోగా నటించిన తాజా సూపర్ డూపర్ హిట్ మూవీ 'వేలై ఇల్లా పట్టదారి' తెలుగు తెరకు రానుంది. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కృష్ణచైతన్య సమర్పణలో స్రవంతి రవికిశోర్ ఈ చిత్రాన్ని అనువదించారు. ఇటీవలే అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి.
డిగ్రీ పట్టా పుచ్చుకున్న ఓ నిరుద్యోగ యువకుడి జీవితంలో ఎలాంటి సంఘటనలు జరిగాయి? అనేది ఈ చిత్రం ప్రధాన ఇతివత్తం. వేల్ రాజ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సొంత సంస్థ వండర్ బార్ ఫిలింస్ పతాకంపై ధనుష్ నిర్మించారు. ఈ మధ్యకాలంలో తమిళ పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో 'వేలై ఇల్లా పట్టదారి' ఒకటి. ఇది తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఉన్న కథ కావడంతో ఈ చిత్రాన్ని ఇక్కడ విడుదల చేస్తున్నామని రవికిశోర్ చెప్పారు.
మరిన్ని విశేషాలను రవికిశోర్ చెబుతూ - ''తెలుగు వెర్షన్ కి 'రఘువరన్ బీటెక్' అనే టైటిల్ ఖరారు చేశాం. ఈ చిత్రానికి ప్రధాన బలం కథ, ధనుష్ నటన. ఇప్పటికే తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న అమలాపాల్ ఇందులో కథానాయికగా చేసింది. తనది కూడా మంచి పాత్ర. ఈ చిత్రాన్ని వేల్ రాజ్ అద్భుతంగా తెరకెక్కించారు. అనిరుధ్ స్వరపరచిన పాటలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. వచ్చే వారం పాటలను విడుదల చేసి, అతి త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం'' అని చెప్పారు.
ఈ చిత్రానికి మాటలు: కిశోర్ తిరుమల, సంగీతం: అనిరుధ్, పాటలు: రామజోగయ్య శాస్ర్తి, రచన-ఛాయాగ్రహణం-దర్శకత్వం: ఆర్. వేల్ రాజ్