24 July 2017
Hyderabad
తెలుగు సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు అంటే అంతంత మాత్రమే. అదీ అమెరికన్ ఫిలిం పెస్టివల్స్ లో అవార్డులు కొల్లగొట్టడం అంటే చిన్ని విషయం కాదు. ప్రపంచ నలుమూల దేశాల నుంచి వచ్చే సినిమాలకు పోటీగా ఎదురెళ్లడమే అసాధారణ విషయం. వందలాది సినిమాలు. వేటికవే ప్రత్యేకమైన కథలు..ఇన్నో వేటివ్ థాట్స్. వాటి వెనుక ఎన్నో బ్రెయిన్స్. స్ర్కూట్నీ టఫ్ గా ఉంటుంది. జ్యూరీ టీమ్ కే ఆ సెలక్షన్ అనేది ఓ సవాల్. అంతటి పోటీని సైతం తట్టుకుని అమెరికాలో మన జాతీయ జెండాను రెపరెపలాడించిన తెలుగు చిత్రం `రక్తం`.
సీనియర్ నటుడు బెనర్జీ ప్రధాన పాత్ర లో రాజేష్ టచ్ రివర్ దర్శకత్వంలో తెరకెక్కిన `రక్తం` చిత్రానికి అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ అమెరికా ఇండీ గేదరింగ్ ఫారిన్ డ్రామా ఫీచర్స్ సెగ్మెంట్ లో (2017) ఇటీవల అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇదే ఫిలిం పెస్టివల్ లో మరో ఐదు అవార్డులను సైతం ఎగరేసుకుపోవడానికి `రక్తం` రెడీ అవుతోంది. ఇదే ఫిలిం ఫెస్టివల్ లో మొత్తం ఐదు విభాగాల్లో `రక్తం` నామినేట్ అయింది. ఆ వివరాలివి...
1) ఉత్తమ నటుడిగా: బెనర్జీ
2) ఉత్తమ నటిగా: మధు శాలిని
3) ఉత్తమ దర్శకుడిగా: రాజేష్ టచ్ రివర్
4)ఉత్తమ ఛాయాగ్రాహకుడిగా: రామ్ తులసి
5)ఉత్తమ నిర్మాతలు గా: సునీత కృష్ణన్ , మునిషీ రైజ్ అహ్మద్ `రక్తం` సినిమాకు గానూ నామినేట్ అయ్యారు.
నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో హింసాత్మక మార్గంలోనే నైతిక విలువలు గురించిన చెప్పిన సినిమా ఇది. ఇందులో ప్రధాన పాత్ర పోషించిన సీనియర్ నటుడు బెనర్జీ నటనకు తెలుగు ప్రజల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. అలాగే ఇటు టాలీవుడ్ సినీ ప్రముఖులు, క్రిటిక్స్ బెనర్జీ నటనను కొనియాడారు.