5 September 2015
Hyderabad
వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ రూట్ లో రామ్, రాశీ ఖన్నా డ్యూయెట్!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'శివమ్'. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కృష్ణచైతన్య సమర్పణలో 'స్రవంతి' రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దగ్గర దర్శకత్వ శాఖలో చేసిన శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. పాటల చిత్రీకరణ కోసం ఈ చిత్రబృందం ఇటీవల నార్వే, స్వీడన్ వెళ్లిన విషయం తెలిసిందే.
పాటల చిత్రీకరణ గురించి స్రవంతి రవికిశోర్ మాట్లాడుతూ - '' 'అందమైన లోకం.. అందులోన నువ్వొక అద్భుతం...' అనే పాటను వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ రూట్ అయిన నార్వేలోని అట్లాంటిక్ ఓషన్ రోడ్ లో చిత్రీకరించాం. అలాగే పాటలోని కొంత భాగాన్ని ఓస్లోలో చిత్రీకరించాం.
'నా కోసం జీరో సైజ్ నువ్వు మెయింటైన్ చేయక్కర్లేదు..' అనే పాటను నార్వేలోని కేరేంగేర్, ట్రాల్ స్టిజన్, డాల్స్ నిబ్బా, స్టాల్ హేమ్ వంటి అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించాం.
నార్వేలోని ఈ లొకేషన్స లో ఇంతవరకూ ఏ భారతీయ చిత్రం చిత్రీకరణ జరుపుకోలేదు.
'గుండె ఆగిపోతోందే.. వళ్లు కాగిపోతోందే..' పాటను స్వీడన్ లోని బ్యూటిఫుల్ ఓల్డ్ టౌన్ అయిన 'గామ్లా స్టాన్'లో చిత్రీకరించాం. అలాగే, సెర్గెల్స్ టార్గ్ లో కొంత భాగం చిత్రీకరించాం. భాస్కరభట్ల రాసిన ఈ మూడు పాటలను రామ్, రాశీ ఖన్నా పాల్గొనగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో చిత్రీకరించాం. ఇంకా రెండు పాటలు చిత్రీకరించాల్సి ఉంది. వాటిని ఈ వారం నుంచి జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో హైదరాబాద్ లో చిత్రీకరిస్తాం. రెండు పాటల్లో ఒకటి ఇంట్రడక్షన్ సాంగ్, మరొకటి టీజింగ్ సాంగ్. ఈ నెల 12న పాటలను విడుదల చేసి, అక్టోబర్ 2న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం'' అని చెప్పారు.
దర్శకుడు మాట్లాడుతూ - ''ఇది హై ఓల్టేజ్ లవ్ స్టోరి. లవ్, కామెడీ, సెంటిమెంట్, యాక్షన్.. అన్ని అంశాలూ ఉన్న కథ. రామ్ ఎనర్జీ లెవల్స్ కి తగ్గ పాత్రను చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన పాటలు ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి'' అని చెప్పారు.
బ్రహ్మానందం, అభిమన్యుసింగ్, జయప్రకాశ్ రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: రసూల్ ఎల్లోర్, యాక్షన్: పీటర్ హెయిన్స్.