రోగ్, సింగం3 సినిమాలతో విలన్గా ఎంట్రీ ఇచ్చిన నటుడు అనూప్ సింగ్ ఠాకూర్. అనూప్ నటించిన రోగ్ మార్చి 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందర్భంలో అనూప్ మీడియాతో మాట్లాడారు. అనూప్ మాట్లాడుతూ - ``నేను మూడు సంవత్సరాల క్రితమే సినిమాల్లోకి రావాలనుకున్నాను. నేను మహాభారతం సీరియల్లో నటిస్తున్నప్పుడు నా నటనకు మంచి ప్రశంసలు లభించాయి. ఎలాగైనా పూరిగారి సినిమాల్లో నటించాలని ఇక్కడకు వచ్చినప్పుడు అల్యూమినియం ఫ్యాక్టరీలో టెంపర్ షూటింగ్ జరుగుతుంటే నేను దూరం నుండి చూశాను. ఇప్పుడు పూరిగారి దర్శకత్వంలో రోగ్ సినిమాతో పరిచయం కావడం ఎంతో ఆనందంగా ఉంది. నేను మిస్టర్ వరల్డ్ అవార్డ్ గెలుచుకున్న దానికంటే పూరిగారి సినిమాలో అవకాశం రావడంతో ఎక్కువగా సంతోషించాను. పూరిగారు నన్ను చాలా కొత్తగా చూపించారు. ఆయనకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. నేను రోగ్తో తెలుగు, కన్నడ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా తెలుగు సినిమాలకే నా ప్రాధాన్యం ఉంటుంది. ఎందుకంటే నేను తెలంగాణ ప్రాంతానికి చెందిన వాడిని మా పూర్వీకులు ముంబైలో సెటిల్ అయ్యారు. తెలుగు సినిమాల్లో ఎవరు కష్టపడితే వారికే ఎక్కవ ప్రాధాన్యత ఉంటుంది. నేను ఇంకా రెండు సినిమాలు చేస్తున్నాను. నేను హీరోగా కూడా నటించబోతున్నాను. త్వరలోనే వాటి వివరాలను తెలియజేస్తాను. అలాగే బాలీవుడ్లో కూడా సినిమాలు చేస్తున్నాను`` అన్నారు.