24 March 2020
Hyderabad
శార్వరి ఉగాది... సర్వ శుభాలు చేకూర్చాలి- స్రవంతి రవికిశోర్
``యావత్ ప్రపంచం ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో ఉండాలి. శార్వరి నామ సంవత్సరం అన్ని విధాలా అందరికీ కలిసిరావాలి`` అని ప్రముఖ నిర్మాత, స్రవంతి మూవీస్ అధినేత స్రవంతి రవికిశోర్ అన్నారు. ఆయన ప్రస్తుతం `రెడ్` మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ హీరోగా నటించారు. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఏప్రిల్ 9న చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా సినీ పరిశ్రమ షట్డౌన్ అయిన విషయం తెలిసిందే.
స్రవంతి రవికిశోర్ మాట్లాడుతూ ``ప్రస్తుతం మానవాళి కరోనా వైరస్తో యుద్ధం చేస్తోంది. ప్రపంచమంతా సంక్షోభంలో ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యం అనుకునే సంస్కృతి మనది. ఎవరికి వారై ఉంటూ, కలిసికట్టుగా కరోనా వైరస్ను పారదోలుదాం. ఈ నూతన సంవత్సరంలో చీకటిని తరిమి కొత్త వెలుగులను ఆహ్వానిద్దాం... ఆస్వాదిద్దాం! మనిషి ఆనందంగా ఉంటేనే వినోదం వైపు దృష్టి మళ్లుతుంది. కరోనా గురించి ప్రజానీకం కంగారు పడుతున్న ఈ తరుణంలో వినోదాన్ని వాయిదా వేద్దాం. పరిస్థితులన్నీ కుదురుకున్నప్పుడు సినిమాల సంగతిని ప్రస్తావించుకుందాం. అప్పటిదాకా అందరి క్షేమమే మా కాంక్ష`` అని చెప్పారు.