08 July 2015
Hyderabad
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యులౌతున్న వారాహి చలనచిత్రం
తెలుగు చిత్రసీమలో ‘ఈగ, అందాల రాక్షసి, లెజెండ్, ఉహలు గుస గుసలాడే, దిక్కులు చూడకు రామయ్యా, తుంగభద్ర’ వంటి విజయవంతమైన చిత్రాలను వారాహి చలనచిత్రం బ్యానర్ పై నిర్మించిన ఆ సంస్థ అధినేత సాయికొర్రపాటి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యులౌతున్నారు. అదెలాగంటే టాలీవుడ్ ప్రెస్టిజియస్ మూవీ ‘బాహుబలి’ ఈ నెల 10న వరల్డ్ వైడ్ గా విడుదలవుతుంది. కృష్ణాజిల్లాలో బాహుబలి చిత్రాన్ని 30 బెనిఫిట్ షోలను వారాహి చలనచిత్రం వారు ప్రదర్శించనున్నారు. ఈ షోల నిర్వాహణకు అక్కడ కలెక్టర్ పర్మిషన్ కూడా తీసుకున్నారు. ఈ బెనిఫిట్ షోల ద్వారా వచ్చే మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అందజేయాలని వారాహి చలనచిత్రం అధినేత సాయికొర్రపాటి నిర్ణయించుకున్నారు. గతంలో కూడా హుదూద్ తుఫాన్ బాధితుల కోసం ఆర్ధిక సహాయం చేయడమే కాకుండా 100 టన్నుల బియ్యాన్ని పంపిణీ చేశారు. ఇప్పుడు ‘బాహుబలి’ బెనిఫిట్ షోల ద్వారా వచ్చే మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి అందజేయడం ఆయన సహృదయతకు నిదర్శనం.