22 September 2016
Hyderabad
ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న తమిళ చిత్రం 'విశారణై' ఈ ఏడాది ఉత్తమ విదేశీ భాషా చిత్రాల రేసులో ఆస్కార్ అవార్డ్ రేసులో నిలిచింది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో...
ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు టి.పి.అగర్వాల్ మాట్లాడుతూ - ''సభ్యులందరూ కలిసి విశారణై సినిమాను ఆస్కార్ అవార్డ్స్కు పంపడానికి నిర్ణయం తీసుకున్నాం. వారం రోజులుగా సాగుతున్న ఈ ప్రక్రియకు ఓ ముగింపు వచ్చింది. హైదరాబాద్ ఫిలించాంబర్ ఎంతో సపోర్ట్ చేసింది. అందరికీ థాంక్స్'' అన్నారు.
ఫిలింఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆస్కార్ జ్యూరీ ఛైర్మన్ కేతన్ మాట్లాడుతూ - ''జ్యూరీ సభ్యులు వారం రోజులుగా 29 సినిమాలను చూశాం. అందులో 13 సభ్యుల ఏకగ్రీవంగా విశారణై సినిమాను బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ పోటీల రేసుకు పంపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమాను పోటీలో ఎంపిక చేయడానికి సినిమాలోని కంటెంట్, తీసిన విధానం, సాంకేతిక అంశాలే కారణం. మా జ్యూరీలో ఎవరూ తమిళ సభ్యులు లేరు. అయినా విశారణై సినిమాను ఎంపిక చేశాం. మా జ్యూరీపై ఎలాంటి ఒత్తిడులు లేవు. అలాగే ఫారిన్ లాంగ్వేజెస్ మూవీ ఎంట్రీల సంఖ్యను పెంచాలని ఆస్కార్ కమిటీకి విన్నవిస్తాం'' అన్నారు.