తమిళ సినీ ఇండస్ట్రీలో విజయవంతమైన ప్రముఖ కంటెంట్ స్టూడియో అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అందులో భాగంగా టెంపుల్ టౌన్ పిక్చర్స్తో కలిసి చేయబోతున్న సినిమా ‘కనక దుర్గ’ను శనివారం రోజున పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. వెర్సటైల్ స్టార్ అల్లరి నరేష్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో కాజల్ చౌదరి హీరోయిన్. ఈ సినిమాలో నటుడు సుబ్బరాజు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ భక్తి ప్రధాన కథా చిత్రానికి బి.వి.ఎస్. రవి కథ అందిస్తుండగా..ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు. సమీర్ నాయర్, దీపక్ సెహగల్, అజిత్ ఠాకూర్, బి.వి.ఎస్.రవి నిర్మాతలు.
భారతీయ దేవతల ఆధారంగా ఒక దివ్యమైన ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ ఈ సినిమా భక్తి, యాక్షన్, భావోద్వేగాలు, సంగీతం ఇలా అన్ని అంశాలతో ప్రేక్షకులకు ఓ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ను అందించనుంది. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో టెంపుల్ టౌన్ పిక్చర్స్ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమా ఈ రెండు సంస్థలకు ఎంతో ప్రత్యేకమైనది.
ఘనంగా జరిగిన కార్యక్రమంలో సురేఖ కొణిదెలతో పాటుగా ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, హరీష్ శంకర్, మిక్కిలినేని సుధాకర్, కోన వెంకట్, ప్రశాంత్ వర్మ, మధుర శ్రీధర్, స్వప్నాదత్, సుప్రియ, విద్యా కొప్పినీడు, పద్మ కస్తూరి రంగన్, అనురాధ గూడూరు, దివ్య విజయ్, హన్షిత రెడ్డి, జాన్వీ నారంగ్, స్రవంతి చొక్కారపు, వైఘా రెడ్డి, విరుప తదితరులు అతిథులుగా విచ్చేశారు. సినిమా భావాన్ని ప్రతిబింబిస్తూ పూజా కార్యక్రమం చివర్లో కనకదుర్గ అమ్మవారి దివ్య స్త్రీ శక్తిని ప్రత్యేకంగా స్మరించుకున్నారు. హాజరైన మహిళలు కలిసి అమ్మవారి శక్తి, కరుణ, మహిమలను గౌరవించారు.
ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, సురేఖ కొణిదెల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. స్వప్న దత్ గౌరవ దర్శకత్వం వహించారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి స్క్రిప్ట్ను అందించారు.
అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ బిజినెస్ హెడ్ సునీల్ చైనాని మాట్లాడుతూ “దక్షిణ భారత సినిమా ఎప్పటికీ కథలను చెప్పడంలో అత్యంత ఆసక్తికరమైన వేదికలలో ఒకటిగా నిలుస్తోంది. తమిళంలో మా ప్రయాణం ఎంతో ప్రోత్సాహకరంగా, విజయవంతంగా సాగింది. ఇప్పుడు ‘కనక దుర్గ’తో తెలుగులోకి అడుగుపెడుతుండటం ఎంతో ఆనందంగా ఉంది. భక్తి, సంస్కృతి, భావోద్వేగాల కలయికలతో ఈ సినిమా రూపొందుతోంది. అజిత్ ఠాకూర్, బి.వి.ఎస్.రవి, అల్లరి నరేష్, ప్రదీప్ మద్దాలితో కలిసి పని చేయటం చాలా ఆనందంగా ఉంది” అన్నారు.
టెంపుల్ టౌన్ పిక్చర్స్ నిర్మాతలు అజిత్ ఠాకూర్ మరియు బి.వి.ఎస్. రవి మాట్లాడుతూ “‘కనక దుర్గ’ కథ తెలుగు నేలకు సంబంధించిన ఆధ్యాత్మికత, సంస్కృతిలో బలంగా నాటుకుపోయింది. దీంతో మా ప్రయాణం ప్రారంభం కావటం ఎంతో ప్రత్యేకం. మా బ్యానర్లో రూపొందుతోన్న తొలి తెలుగు సినిమా ఇది. మంచి కథతో పాటు మంచి భాగస్వామ్యంలో సినిమా చేస్తుండటం అదృష్టంగా భావిస్తున్నాం. మా ప్రయాణంలో తోడుగా నిలుస్తోన్న అప్లాజ్ ఎంటర్టైన్మెంట్కి థాంక్స్. దైవ అనుగ్రహంతోనే ఈ ప్రయాణం సాగుతున్నట్లు అనిపిస్తోంది. అమ్మవారి ఆశీర్వాదంతోనే ఈ సినిమాను రూపొందిస్తోన్న భావన కలుగుతోంది” అన్నారు.
దర్శకుడు ప్రదీప్ మద్దాలి మాట్లాడుతూ ‘‘‘కనక దుర్గ’ సినిమా నాకు చాలా ప్రత్యేకం. దర్శకుడిగా మాత్రమే కాదు, ఆ అమ్మవారిపై నాకు ఉన్న భక్తి కూడా దీనికి కారణం. ఈ సినిమా నా హృదయానికి ఎంతో దగ్గరైంది. ఈ సినిమా అసలు కథ భక్తి గురించి మాత్రమే కాదు..జీవితంలో చిద్రమైన ఒక మనిషి, తనకంటే గొప్పదైన శక్తిని ఎదుర్కొన్నప్పుడు ఏమి జరుగుతుందో చెప్పే కథే ఇది. మా కథను నమ్మి ‘అప్లాజ్ ఎంటర్టైన్మెంట్’ లాంటి సంస్థ ముందుకు రావడం, అలాగే ‘టెంపుల్ టౌన్ పిక్చర్స్’ ఈ ప్రాజెక్ట్ను ఇంత నమ్మకంతో ముందుకు తీసుకెళ్లడం చాలా ఆనందంగా, ఉత్సాహంగా,భావోద్వేగం కూడా ఉండి, విజువల్గా కూడా భారీ స్థాయిలో ఉండే ఈ సినిమాతో మా ప్రయాణాన్ని ప్రారంభించడం మాకు చాలా గర్వంగా ఉంది” అన్నారు.