ఫిలడెల్ఫియా తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో ‘నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కు ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఆదివారం, ఆగస్టు 9వ తేదీన పెన్సిల్వేనియాలోని చెస్టర్ స్ప్రింగ్స్ ‘బైయర్స్ స్టేషన్ క్లబ్ హౌస్’ (Byers Station Club House)లో అత్యంత వైభవంగా జరిగింది.
భారత ప్రభుత్వం నుండి అత్యున్నత ‘పద్మశ్రీ’ పురస్కారం అందుకున్న సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ ను గౌరవించుకోవడానికి రవి పొట్లూరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష సంఖ్యలో తెలుగువారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
చిత్రపరిశ్రమలో దాదాపు 49 సంవత్సరాలుగా విలక్షణమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న రాజేంద్ర ప్రసాద్ గారి సినీ ప్రయాణాన్ని మరియు సేవలను సభలో కొనియాడారు. హాస్యరస చిత్రాలతో పాటు ఎన్నో ఉత్తమ పాత్రలతో అలరించిన ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం తెలుగుజాతికే గర్వకారణమని హాజరైన తెలుగు సంఘాల ప్రతినిధులు, అభిమానులు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రాజేంద్ర ప్రసాద్ నిర్వహిస్తున్న 'ఛారిటబుల్ ట్రస్ట్' (Charitable Trust) కు ఎనిమిది లక్షల రూపాయల విరాళం అందించారు, తమ పూర్తి మద్దతు మరియు సహకారం ఎల్లప్పుడూ ఉంటాయని ఫిలడెల్ఫియా తెలుగు ప్రజలు హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో పాల్గొన్న కమ్యూనిటీ సభ్యులు ఆయనతో జ్ఞాపకాలను పంచుకుని, దుశ్శాలువాలు, పూలమాలలు మరియు జ్ఞాపికలతో రాజేంద్ర ప్రసాద్ గారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ ప్రవాస తెలుగు ప్రజలు తనపై చూపిస్తున్న ఆప్యాయతకు, ప్రేమానురాగాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సముద్రాలు దాటి వచ్చినా, ప్రవాసాంధ్రులు తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలు చూస్తుంటే కన్నతల్లి ఒడిలో ఉన్నట్లే ఉంది. మీ ప్రేమే నన్ను ఇన్నేళ్లుగా నటుడిగా ముందుకు నడిపిస్తోంది అని పేర్కొన్నారు. ఈ 'పద్మశ్రీ' పురస్కారం తనకు లభించిన గౌరవం మాత్రమే కాదని, తనను ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికీ చెందుతుందని వినయంగా తెలిపారు. తన 49 ఏళ్ల నటనా ప్రయాణంలో నవ్వులను పంచి, ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకోవడం కన్నా పెద్ద అవార్డు మరొకటి లేదని అన్నారు.
శ్వేత కొమ్మోజి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో జగదీప్ రెడ్డి ఆనుముల, పరమేశ్ భీమ్ రెడ్డి, వేణు సంగాని, సతీష్ తుమ్మల, రామకృష్ణ తాడిశెట్టి, గిరిధర్ మసిరెడ్డి, వేణు కోమటిరెడ్డి, ఫణి కంతేటి, రాజు కక్కెర, సురేష్ వెంకన్నగారి, సునీల్ కోగంటి, వెంకట్ సింగు తదితరులు పాల్గొన్నారు.