కీర్తన మూవీ మేకర్స్ సమర్పణలో శ్రీ శ్రీనివాస విజువల్స్ బ్యానర్పై పార్వతీశం(కేరింత ఫేమ్), సిమ్రాన్ హీరో హీరోయిన్లుగా కొత్త చిత్రం `నువ్వక్కడ నేనిక్కడ` బుధవారం ఉదయం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. పి.లక్ష్మీనారాయణ దర్శకత్వంలో తాడి గనిరెడ్డి, కీర్తన వెంకటేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ముహుర్తపు సన్నివేశానికి పారస్ జైన్ క్లాప్ కొట్టగా, కె.కె.రాధామోహన్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఆర్.బి.చౌదరి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...
చిత్ర దర్శకుడు పి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ - ``అందాల రాముడు, మంచివాడు సినిమాల తర్వాత నా దర్శకత్వంలో వస్తోన్న చిత్రమిది. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత నేను మళ్లీ డైరెక్ట్ చేస్తున్నాను. ఎంటర్టైనింగ్ మూవీ. పార్వతీశం హీరోగా నటిస్తున్నారు. కిర్రాక్ పార్టీ హీరోయిన్ సిమ్రాన్ ఇందులో నటిస్తుంది. యూత్ఫుల్ సబ్జెక్ట్. నిర్మాత గని రెడ్డిగారు కూడా గతంలో కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో నాలుగు సినిమాలను నిర్మించారు. సింగిల్ షెడ్యూల్లో చిత్రీకరణను ప్లాన్ చేశాం. నేటి నుండి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. డిసెంబర్, జనవరిలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు.
పార్వతీశం మాట్లాడుతూ - ``నేను నటిస్తున్న ఆరో చిత్రమిది. హీరోగా నటిస్తున్న తొలి చిత్రమిది. కామెడీ హీరోగా మంచి పేరు వస్తుందనే నమ్మకం ఉంది`` అన్నారు.
సిమ్రాన్ మాట్లాడుతూ - ``కిర్రాక్ పార్టీ తర్వాత హీరోయిన్గా నటిస్తున్న చిత్రమిది. మంచి కాన్సెప్ట్. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్`` అన్నారు.
నిర్మాత తాడి గనిరెడ్డి మాట్లాడుతూ - ``డైరెక్టర్ని, కథను నమ్మి చాలా గ్యాప్ తర్వాత నిర్మిస్తున్న చిత్రమిది. తప్పకుండా సినిమా ఎంటర్టైనింగ్గా ఉంటుంది`` అన్నారు.