29 September 2018
Hyderabad
ఆశిష్ గాంధీ, ఆషిమా నెర్వాస్ జంటగా నటించిన సినిమా `నాటకం`. కల్యాణ్ జి.గోగన దర్శకుడు. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రిజ్వాస్ ఈ సినిమాను విడుదల చేశారు. ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. శనివారం హైదరాబాద్లో సక్సెస్ మీట్ను ఏర్పాటు చేశారు.
సమర్పకుడు రిజ్వాస్ మాట్లాడుతూ ``మా చిత్రానికి సర్వత్రా మంచి స్పందన వస్తోంది. అనుకున్నదానికన్నా ఎక్కువ థియేటర్లలో విడుదల చేశాం. మేం ఊహించినదానికన్నా ఎక్కువగా ప్రజాదరణ దక్కుతోంది. చిన్న సినిమా అయినా ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. అందరూ కొత్తవారయినా అనుభవజ్ఞుల్లా నటించారు`` అని అన్నారు.
దర్శకుడు కల్యాణ్ జి.గోగన మాట్లాడుతూ ``మౌత్టాక్ స్ప్రెడ్ అయింది. సంగీతం సినిమాకు ప్లస్ అయింది. కలెక్షన్లు మెప్పిస్తున్నాయి. సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాం. అయితే ఇప్పుడు ప్రేక్షకులు ఇస్తున్న స్పందన చూశాక మేం పడ్డ కష్టం చాలా తక్కువని అనిపిస్తోంది`` అని చెప్పారు.
సంగీత దర్శకుడు సాయికార్తీక్ మాట్లాడుతూ ``సినిమా బావుంటే చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా ప్రేక్షకులకు ఉండదు. సినిమాను అందరూ ఆదరిస్తారు. ఈ విషయాన్ని మా సినిమా మరో సారి నిరూపించింది. ఆశిష్ చాలా బాగా చేశాడు. మొదటి నుంచీ సినిమా హిట్ అవుతుందని నాకు అనిపిస్తూనే ఉంది`` అని అన్నారు.
హీరో మాట్లాడుతూ ``సినిమా విడుదలైనప్పటి నుంచి పలు ప్రాంతాల నుంచి ఫోన్లు వస్తున్నాయి. బాగా నటించానని ఇప్పటికే చాలా మంది చెప్పారు. విదేశాలనుంచి కూడా ఫోన్లు రావడం ఆనందంగా అనిపించింది. సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియన్స్ కి థాంక్స్. మా నిర్మాతకు మంచి డబ్బులు రావాలి`` అని అన్నారు.