pizza
Bharat Ane Nenu success celebrations
'భరత్‌ అనే నేను' బ్లాక్‌ బస్టర్‌ సెలబ్రేషన్స్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

28 April 2018
Hyderabad

సూపర్‌స్టార్‌ మహేశ్‌ హీరోగా డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై.. కొరటాల శివ దర్శకత్వంలో దానయ్య డి.వి.వి నిర్మించిన చిత్రం 'భరత్‌ అనే నేను'. సినిమా ఏప్రిల్‌ 20న విడుదలైంది. శనివారం సినిమా బ్లాక్‌బస్టర్‌ సెలబ్రేషన్స్‌ను హైదరాబాద్‌ నోవాటెల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో....

సూపర్‌స్టార్‌ మహేశ్‌ మాట్లాడుతూ - ''సినిమా సక్సెస్‌ కావడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఫస్ట్‌షాట్‌లో శివగారు పది పేజీల డైలాగ్‌ ఇచ్చారు. ఎలా చేస్తానో అని చిన్న భయం ఉంది. కానీ చేసిన తర్వాత గర్వంగా అనిపించింది. నేను పనిచేసిన టీమ్స్‌లో బెస్ట్‌ టీమ్‌ ఇదే. అమ్మగారి ఏప్రిల్‌ 20న సినిమా విడుదలైంది. నాన్నగారి పుట్టినరోజు మే 31 వరకు షేర్స్‌ను డిస్ట్రిబ్యూటర్స్‌ ఇలాగే చెబుతుండాలి. నాన్నగారి అభిమానులు, నా అభిమానులు నన్ను సూపర్‌స్టార్‌ అంటుంటారు. ఆ సూపర్‌స్టార్‌ అనే పదానికి నాలుగేళ్లలో రెండు సార్లు శివగారు లైఫ్‌ ఇచ్చారు. అందుకు ఆయనకు రుణపడి ఉంటాను. ఆయనకున్న నాలెజ్డ్‌ అమోఘం. అలాగే శ్రీకర్‌ ప్రసాద్‌గారితో పనిచేయడం ఆనందంగా ఉంది. ఆయన ఎడిట్‌ చేస్తే సినిమా ఓ టెక్ట్స్‌ బుక్‌లా ఉంటుంది. దేవిశ్రీప్రసాద్‌ కమిట్‌మెంట్‌, ప్యాషన్‌ ఉన్న మ్యూజిక్‌ డైరెక్టర్‌. దానయ్యగారి ఎనర్జీ అలాగే ఉండాలి. ఆయన ఇలాంటి గొప్ప సినిమాలు మరెన్నో తీయాలని కోరుకుంటున్నాను. నాన్నగారు అభిమానులు, నా అభిమానులు నాకు ఇచ్చిన సపోర్ట్‌ మరచిపోలేను. ఇలాగే శ్రద్ధతో, అంత:కరణ శుద్ధితో సినిమాలు చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను'' అన్నారు.

కొరటాల శివ మాట్లాడుతూ - ''ఇంత పెద్ద సక్సెస్‌ను అందించిన తెలుగు ప్రేక్షకులకు థాంక్స్‌. ఈ సినిమాకు ఎక్కడా రాజీ పడకుండా దానయ్యగారు నిర్మించారు. చివరి షెడ్యూల్‌లో కూడా ఖర్చుకు వెనుకాడలేదు. నా కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో.. ఎక్కువ రోజులు చేసిన సినిమా. ఆయన లేకుంటే ఈ సినిమా ఇంత గొప్పగా వచ్చుండేది కాదు. దానయ్యగారు వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ ప్రొడ్యూసర్‌. శ్రీమంతుడు సినిమా నుండి నాకు మహేశ్‌గారితో మంచి అనుబంధం ఉంది. మంచి కథ రాసుకుంటే చాలు.. ఓ సీన్‌ను నేను రాసిన దాని కంటే ఇంకా అందంగా వస్తుందంటే మహేశ్‌లాంటి హీరోనే కారణం. అలాంటి యాక్టర్‌కి యాక్షన్‌ అని చెప్పడం కల నిజమైనట్లు. అలాగే దేవిశ్రీ ప్రసాద్‌ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. నేను ఏదైనా సన్నివేశం చెబితే నాకంటే ఎక్కువగా ఎమోషనల్‌గా ఫీలై సంగీతాన్ని అందిస్తారు. అందుకు దేవిశ్రీకి థాంక్స్‌. అలాగే నా మాట కంటే రామజోగయ్యగారి పాట నా సినిమాల్లో పోటీ పడుతుంటుంది. శ్రీహరినాను మహేశ్‌బాబుగారికి పెద్ద ఫ్యాన్‌. ఏ కథ రాసుకున్నా, మహేశ్‌గారిని దృష్టిలో పెట్టుకునే చేసుకుంటారు. ఈ సినిమాకు కూడా మహేశ్‌గారు సీఎం అయితే ఎలా ఉంటుందనే దాన్ని దృష్టిలో పెట్టుకుని రాసుకున్నారు. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాను. అలాగే మా డైరెక్షన్‌ టీమ్‌ వల్ల డిఫరెంట్‌ ఎక్స్‌పీరియెన్స్‌ వచ్చింది. అందరూ ఏదీ చేస్తే బావుంటుందో అది ఆలోచించుకుని సినిమా చేశారు. పోసానిగారు, జీవాగారు, ప్రకాశ్‌రాజ్‌గారు ఇలా స్టార్‌ యాక్టర్స్‌తో పనిచేసే అవకాశం కలిగింది. అలాగే ఆర్ట్‌ డైరెక్టర్‌ సురేశ్‌గారి వంటి ప్రొఫెషనల్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌ని నేను చూడలేదు. రెండేళ్లు నా సినిమాకు మాత్రమే పనిచేశారు. అప్పటి వరకు ఇంటికి కూడా వెళ్లకుండా ఇక్కడే ఉన్నారు. తిరు, రవి.కె.చంద్రన్‌ వంటి కెమెరామెన్స్‌తో పనిచేయడం వల్ల చాలా విషయాలను నేర్చుకున్నాను. అలాగే ఎడిటర్‌ శ్రీకర్‌ప్రసాద్‌గారితో పనిచేసే అవకాశం ఇంత త్వరగా వస్తుందనుకోలేదు. ఎడిటింగ్‌ వల్ల సినిమా అడుతుందని ప్రాక్టికల్‌గా ఈ సినిమాతో తెలుసుకున్నాను. ఆయనతో పనిచేయడం గర్వంగా ఉంది. చాలా పెద్దగా కొట్టాలని ముందు నుండి అనుకుంటున్నాం. అందరి సపోర్ట్‌తో అది సాధ్యమైంది'' అన్నారు.

దానయ్య డి.వి.వి మాట్లాడుతూ - ''నేను ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవుతుందని మాట ఇచ్చాను. అన్నట్లుగానే సినిమా పెద్ద హిట్‌ అయ్యింది. నా బ్యానర్‌లో ఇంత పెద్ద సినిమా చేయడం, గర్వపడే సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఇంత మంచి సినిమా చేసిన డైరెక్టర్‌ శివగారికి అజన్మాంతం రుణపడి ఉంటాను. అలాగే మహేశ్‌బాబుగారితో సినిమా చేయాలనే కోరిక ఇంత గొప్ప సినిమాతో తీరింది. అందుకు మహేశ్‌బాబుగారికి ఆజన్మాంతం రుణపడి ఉంటాను. మా చిత్రంలో నటించిన నటీనటులు, టెక్నీషియన్స్‌కు థాంక్స్‌. అందరూ రాత్రింబగళ్లు కష్టపడి సినిమాను పూర్తి చేశారు. ఈ సినిమాకు వచ్చినంత అప్రిసియేషన్స్‌ మరే సినిమాకు రాలేదు. ఎవరో తెలియనివాళ్లు కూడా నన్ను అభినందిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మా సినిమా 161.28 కోట్ల రూపాయల కలెక్షన్స్‌ను రాబట్టుకుంది. ఇది రియల్‌ కలెక్షన్స్‌'' అన్నారు.

పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ - ''దర్శకుడు కొరటాల శివ నా మేనల్లుడు. వాడి నిర్ణయంపై నాకు మంచి నమ్మకం ఉంది. తను తక్కువ మాట్లాడుతాడు. చేతలు ఎక్కువ చేస్తాడు. మహేశ్‌బాబు గురించి చెప్పాలంటే.. మహేశ్‌ బాబు అలానే ఉన్నాడు. మేమంతా ముసలివాళ్లం అయిపోతున్నాం. మహేశ్‌ ఎంత అందంగా ఉంటాడో అతని మనసు కూడా అంతే అందంగా ఉంటుంది. ఇక దానయ్యగారికి థాంక్స్‌'' అన్నారు.

దేవిశ్రీ ప్రసాద్‌ మాట్లాడుతూ - ''సినిమా సక్సెస్‌ ఆనందం ప్రతి డిస్ట్రిబ్యూటర్‌ కళ్లల్లో కనపడుతుంటుంది. సినిమా బ్లాక్‌బస్టర్‌ రేంజ్‌ను దాటి హిట్‌ అయ్యింది. రామజోగయ్యగారు అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. కొరటాల శివగారు చేసే ప్రతి లైన్‌ కొత్తగా, ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుంది. దానయ్యగారికి కంగ్రాట్స్‌. మహేశ్‌గారే కాదు.. ఆయన హృదయం కూడా సూపర్‌స్టారే. ఆయన ఇచ్చే సపోర్ట్‌ మరిచపోలేం'' అన్నారు. ఈ వేడుకలో డిస్ట్రిబ్యూటర్స్‌ సక్సెస్‌ షీల్డ్స్‌ను బహుకరించారు.



Photo Gallery (photos by G Narasaiah)

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved